రాజశేఖర్‌ రాజీనామాను ఆమోదించిన ‘మా’

సినీ నటుడు రాజశేఖర్‌ మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) కార్యనిర్వాహక ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఆదివారం జరిగిన ఎగ్జిక్యూటివ్‌...

Published : 05 Jan 2020 18:21 IST

హైదరాబాద్‌: సినీ నటుడు రాజశేఖర్‌ మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) కార్యనిర్వాహక ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఆదివారం జరిగిన ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యుల సమావేశంలో రాజశేఖర్‌ చేసిన రాజీనామాను ‘మా’ ఆమోదించింది. దీంతో పాటు క్రమశిక్షణ చర్యల కోసం ఉన్నతస్థాయి కమిటీని కూడా ‘మా’ నియమించింది. కృష్ణంరాజు, చిరంజీవి, మురళీమోహన్‌, మోహన్‌బాబు, జయసుధలతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ మేరకు ‘మా’ ప్రకటన విడుదల చేసింది. 

అసలేం జరిగిందంటే..!

ఇటీవల నూతన సంవత్సరం సందర్భంగా ‘మా’ డైరీ ఆవిష్కరణ కార్యక్రం జరిగింది. ఈ సందర్భంగా అగ్ర కథానాయకుడు చిరంజీవి మాట్లాడుతూ.. ‘మంచి ఉంటే మైకులో.. చెడు ఉంటే చెవిలో చెబుదాం’ అంటూ ‘మా’ నెలకొన్న విభేదాలను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం అక్కడే ఉన్న సినీ నటుడు, ‘మా’ ఉపాధ్యక్షుడు రాజశేఖర్‌ ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ చేతిలో నుంచి మైక్‌ లాక్కుని ఆవేశంతో ప్రసంగించారు. అంతేకాకుండా సభలో కూర్చున్న కృష్ణంరాజు, మోహన్‌బాబు, చిరంజీవి కాళ్లకు నమస్కారం చేశారు. ‘మా’లో గొడవలున్నాయంటూ మరోసారి ప్రస్తావించారు. దీంతో స్టేజ్‌పై ఉన్న చిరంజీవి, మోహన్‌బాబుతోపాటు ఇతర నటీనటులు తీవ్ర అసహనానికి గురయ్యారు. ‘‘మార్చిలో ‘మా’ కొత్త కార్యవర్గం ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకూ ఒక్క సినిమా కూడా చేయలేదు. మా ఇంట్లో కూడా బాగా తిట్టారు. ‘మా’ కోసం ఎందుకు అంతలా పనిచేస్తున్నావ్‌ అన్నారు. అందరం కలిసే నడవాలని చిరంజీవిగారు చాలా బాగా మాట్లాడారు. కానీ, ఇక్కడ నిప్పును కప్పిపుచ్చితే పొగ వస్తుంది. ‘మా’లో గొడవలున్నాయి. రియల్‌ లైఫ్‌లో హీరోగా పనిచేస్తుంటే తొక్కేస్తున్నారు’ అని చెప్పారు.

దీంతో అసంతృప్తికి గురైన చిరంజీవి.. ‘నేను చెప్పిన మాటకు ఎవరూ విలువ ఇవ్వలేదు. మా మాటలకు గౌరవం ఇవ్వనప్పుడు మేమంతా ఇక్కడ ఎందుకు ఉండాలి. ఎందుకు సభను రసాభాస చేయడం. రాజశేఖర్‌ మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎంతో సజావుగా సాగుతున్న సభలో ఒక గౌరవం లేకుండా ఇలా మైక్‌ లాక్కుని ఎలా పడితే అలా మాట్లాడడం ఏం బాగోలేదు. ఇప్పుడు కూడా నేను స్పందించకపోతే.. మీరిచ్చే పెద్దరికానికి అర్థం ఉండదు. దయచేసి దీనిని వదిలేయండి. ఎవరూ కోపావేశాలకు వెళ్లొద్దు. ఇలాంటప్పుడు ఇష్టం లేకపోతే రాకూడదు. ఇలా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోండి’ అని అన్నారు. ఆ రోజు సాయంత్రం రాజశేఖర్‌ తన ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా, ఆదివారం సమావేశమైన ‘మా’ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ రాజశేఖర్‌ చేసిన రాజీనామాను ఆమోదించి, క్రమశిక్షణ చర్యల కమిటీని ఏర్పాటు చేసింది. 

ఇవీ చదవండి..!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని