మనో వీడియో.. చిన్మయి కామెంట్స్‌

ప్రముఖ సింగర్‌ మనో పోస్ట్‌ చేసిన వీడియోనుద్దేశిస్తూ గాయని చిన్మయి షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. గడిచిన ఏడాదిన్నరలో ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నానని ఆమె.....

Updated : 10 Feb 2020 22:24 IST

చెన్నై: ప్రముఖ సింగర్‌ మనో పోస్ట్‌ చేసిన వీడియోనుద్దేశిస్తూ గాయని చిన్మయి షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. గడిచిన ఏడాదిన్నరలో ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నానని ఆమె పేర్కొన్నారు. సింగర్‌ కార్తీక్‌ తనను వేధింపులకు గురి చేస్తున్నాడని కొంతకాలం క్రితం సోషల్‌మీడియా వేదికగా చిన్మయి చేసిన ఆరోపణలు కోలీవుడ్‌లో దుమారం రేపాయి. ఆ తర్వాత కోలీవుడ్‌లో చాలా పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల కోలీవుడ్‌లో జరిగిన డబ్బింగ్‌ యూనియన్‌ ఎన్నికల్లో పోటీ చేసేందుకు చిన్మయి నామినేషన్‌ దాఖలు చేశారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల చిన్మయి నామినేషన్‌ తిరస్కరణకు గురయ్యింది. దీంతో సీనియర్‌ నటుడు రాధారవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అంతేకాకుండా వేధింపు ఆరోపణలు ఎదుర్కొన్న కార్తీక్‌కు సైతం యూనియన్‌లో చోటు దక్కింది.

డబ్బింగ్‌ యూనియన్‌ ఎన్నికల గురించి తెలియజేస్తూ సింగర్‌ మనో ఓ వీడియోను విడుదల చేశారు. దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్‌ చేసిన చిన్మయి.. కొన్ని షాకింగ్‌ కామెంట్లు చేశారు. ‘‘చాలా రోజుల క్రితం సింగర్‌ మనోగారు నాకు ఫోన్‌ చేసి.. కార్తీక్‌ గురించి ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వాళ్లందరినీ తీసుకుని తన ఇంటికి రమ్మని చెప్పారు. ‘ఈ వేధింపుల విషయం విని కార్తీక్‌ భార్య బాధపడుతోంది. తన కెరీర్‌ను ఎందుకు నాశనం చేస్తున్నావు? నువ్వు ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డావు. అలాగే తనూ కూడా ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డాడు’ అని చెప్పి, రాజీ కుదర్చడానికి చూశారు. నిజం చెప్పాలంటే వృత్తిపరంగా కార్తీక్‌ అంటే నాకు గౌరవం ఉంది. ఆయన ఎంతో కష్టపడి పెద్ద సింగర్‌ స్థాయికి వచ్చారు. నేను కూడా ఆయనలాగానే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని అందరూ గుర్తించే స్థాయికి వచ్చాను. కానీ, ఈ స్థాయికి వచ్చాక ఆయనలాగా వేరేవాళ్లను వేధింపులకు గురిచేయలేదు. ఏది ఏమైనా గడిచిన ఏడాదిన్నరలో ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నాను. వాళ్లు మంచి సింగర్సే అందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ మంచి పురుషులు మాత్రం కాదు.’ అని చిన్మయి పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని