ఆ సినిమాలకు థియేటర్లు ఇవ్వండి: చిరంజీవి

ప్రముఖ నటుడు బ్రహ్మాజీ కుమారుడు సంజయ్‌ను వెండితెరకు పరిచయం చేస్తున్న చిత్రం ‘ఓ.. పిట్ట కథ’. చెందు ముద్దు దర్శకత్వం వహిస్తున్నారు. భవ్య క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. విశ్వంత్‌, నిత్య, బ్రహ్మాజీ కీలక పాత్రల్లో నటిస్తు్న్నారు.

Updated : 01 Mar 2020 22:55 IST

హైదరాబాద్‌: ప్రముఖ నటుడు బ్రహ్మాజీ కుమారుడు సంజయ్‌ వెండితెరకు పరిచయమవుతున్న చిత్రం ‘ఓ.. పిట్ట కథ’. చెందు ముద్దు దర్శకత్వం వహిస్తున్నారు. భవ్య క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. విశ్వంత్‌, నిత్య, బ్రహ్మాజీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మార్చి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ నటుడు చిరంజీవి హాజరయ్యారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘ఈ మధ్య చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం లేదు. దయచేసి చిన్న సినిమాలనూ ఆదరించాలని పంపిణీదారులను కోరుతున్నా. ఇక నటుల విషయానికి వస్తే.. సినిమా ఇండస్ట్రీలో సానుకూల దృక్పథం చాలా అవసరం. కష్టాల్లో ఉన్నప్పుడు దృఢంగా ఉన్నవాళ్లే ఇక్కడ నిలదొక్కుకోగలుగుతారు. కొత్తతరం నటులకు ఇది చాలా అవసరం. ఈ సినిమా హీరో సంజయ్‌ నేవీ ఉద్యోగం వదులుకొని సినిమాల్లోకి వచ్చాడని విన్నా. నేను కూడా నేవీని వదులుకొని వచ్చిన వాడినే. సినిమా ఇండస్ట్రీలో టాలెంట్‌ ఉన్నవాళ్లకు మంచి భవిష్యత్‌ ఉంటుంది. బ్రహ్మాజీ వంటి నటుడు ఇంట్లో ఉండటం సంజయ్‌ అదృష్టం. ఇక నిత్యాశెట్టి గురించి చెప్పాలంటే.. ఆమె అంజి సినిమాలో చేసిన బాలనటి అని నాకు ఇప్పుడే తెలిసింది. ఆమె పేరు విని ఎవరో ముంబయి నుంచి వచ్చిన హీరోయిన్‌ అనుకున్నా. కానీ, నిత్య అచ్చమైన తెలుగమ్మాయిలా ఉంది. చూస్తుంటే యాంకర్‌ సుమకు పోటీ ఇచ్చేలా కనిపిస్తోంది. ఈ సినిమా బ్రహ్మాజీ, సంజయ్‌తో పాటు నిర్మాత ఇతర నటీనటులందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా’’ అని అన్నారు. ఈ సందర్భంగా ఇటీవల మృతి చెందిన సీనియర్‌ జర్నలిస్టు పసుపులేటి రామారావు కుటుంబానికి భవ్య క్రియేషన్స్‌ తరఫున రూ.2లక్షల చెక్కును మెగాస్టార్‌ చిరంజీవి చేతుల మీదుగా అందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని