భావోద్వేగానికిలోనైన మంచు విష్ణు

కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను కలవరపెడుతోన్న కారణంగా విమానాలు నిలిపివేయడంతో తన భార్యాపిల్లలు విదేశాల్లోనే ఉండిపోవాల్సి వచ్చిందని మంచు విష్ణు అన్నారు. రోజూవాళ్లతో ఫోన్‌లో మాట్లాడుతున్నప్పటికీ ఎంతో బాధగా ఉందని ఆయన భావోద్వేగానికి లోనయ్యారు....

Published : 01 Apr 2020 14:15 IST

ఏప్రిల్‌ 14న అనుమతిస్తారని ఆశిస్తున్నాను

హైదరాబాద్‌: కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను కలవరపెడుతోన్న కారణంగా విమానాలు నిలిపివేయడంతో తన భార్యాపిల్లలు విదేశాల్లోనే ఉండిపోవాల్సి వచ్చిందని మంచు విష్ణు అన్నారు. నిత్యం వాళ్లతో ఫోన్‌లో మాట్లాడుతున్నప్పటికీ ఎంతో బాధగా ఉందని ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. తనలాగానే ఎంతో మంది ఇలా ఇబ్బంది పడుతున్నారని విష్ణు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఇన్‌స్టా వేదికగా ఓ వీడియోను షేర్‌ చేశారు. లాక్‌డౌన్‌ను ప్రతిఒక్కరూ తప్పకుండా పాటించాలని.. ఇళ్లకే పరిమితమై.. జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.

‘హాయ్‌.. లాక్‌డౌన్‌ ఎన్నో రోజో కూడా మర్చిపోయాను. చాలా ఇబ్బందిగా ఉంది. గడ్డం ఎందుకు పెంచుతున్నావని చాలా మంది సోషల్‌మీడియాలో నన్ను అడుగుతున్నారు. కొంతమందికి నచ్చుతుంది. మరి కొంతమందికి నా గడ్డం నచ్చడంలేదు. నేను గడ్డం పెంచడం వెనుక ఓ కారణం ఉంది.  నా పిల్లలు అరియానా, వివియానా, అవ్రామ్‌, ఐరా అలాగే నా భార్య విరానికాను కలిసినప్పుడు దీనిని తీసేద్దాం అనుకున్నాను. ప్రస్తుతం వాళ్లందరూ వేరే దేశంలో ఉండిపోవాల్సి వచ్చింది. నా కుటుంబసభ్యుల్లో ఒకరికి ఆరోగ్య సమస్యల రీత్యా సర్జరీ కోసం ఫిబ్రవరి చివరి వారంలో మేమందరం విదేశాలకు వెళ్లాం. దేవుడు దయ వల్ల సర్జరీ బాగానే జరిగింది. మార్చి 19న మా నాన్న పుట్టినరోజు ఉండడంతో విద్యానికేతన్‌లో వార్షికోత్సవం నిర్వహించాలనే ఉద్దేశంతో నేను అమ్మానాన్న మార్చి 12, 13 తేదీల్లో ఇక్కడికి వచ్చేశాం. నా భార్యాపిల్లలు మరో నాలుగు రోజుల్లో వస్తారనగా.. పరిస్థితులు తారుమారు అయ్యాయి. మన దేశంలోకి అంతర్జాతీయ విమానాలను అనుమతించడంలేదు.  ఏప్రిల్‌ 14కు పరిస్థితులన్నీ మారి విమానాలకు అనుమతిస్తారని ఆశిస్తున్నాను. నాలాగే చాలామందికి కష్టంగా ఉంటోంది. అరియానా, వివియానా పుట్టినప్పటి నుంచి.. నేను పగలు మొత్తం ఎక్కడికి వెళ్లినా సాయంత్రానికి ఇంటికి వచ్చేసి.. వాళ్లతో సమయం గడుపుతున్నాను. ప్రస్తుతం వాళ్లతో రోజూ ఫోన్‌లో మాట్లాడుతున్నప్పటికీ కష్టంగా అనిపిస్తోంది. ఒకవేళ మేమందరం ఒకేచోట ఉండి ఉంటే.. అందరం కలిసి స్వీయ నిర్బంధంలోకి వెళ్లేవాళ్లం’ అని మంచు విష్ణు భావోద్వేగానికి లోనయ్యారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు