నలుగురు యాంకర్లతో సుమ కొత్త గేమ్‌ షో

తనదైన ప్రాసలు, పంచులతో పలు గేమ్‌ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించి.. బుల్లితెర స్టార్‌ యాంకర్‌గా పేరు తెచ్చుకున్నారు సుమ. లాక్‌డౌన్‌ కారణంగా షోలు, సినీ ఫంక్షన్స్‌ లేకపోవడంతో ఇంటికే పరిమితమైన ఆమె తాజాగా ఓ సరికొత్త గేమ్‌ షోతో ప్రేక్షకులను అలరించారు....

Updated : 24 Nov 2022 13:00 IST

గెలిచిన వాళ్లకి బహుమతేంటో తెలుసా..

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన ప్రముఖ యాంకర్‌ సుమ..  తాజాగా ఓ సరికొత్త గేమ్‌ షోతో ప్రేక్షకులను అలరించారు. ఫన్‌తోపాటు విరాళాల సేకరణ కోసం నిర్వహించిన ఈ గేమ్‌ షోలో.. సహచర యాంకర్స్‌ అనసూయ, రష్మి, రవి, ప్రదీప్‌ పాల్గొన్నారు. వీరంతా వారి వారి ఇళ్ల నుంచే ఈ గేమ్‌షోలో పాల్గొని ఆకట్టుకున్నారు. ‘సూపర్‌4 గేమ్‌ షో’ పేరుతో రూపొందించిన ఈ వీడియోలో లాక్‌డౌన్‌ వల్ల ఇంటికే పరిమితమైన వారందరూ ఏం చేస్తున్నారనే విషయాన్ని చాలా సరదాగా చూపించారు. మూడు రౌండ్స్‌తో కూడిన ఈ గేమ్‌ షోలో గెలుపొందిన వారిని చైనాలోని వుహాన్‌ ట్రిప్‌కు పంపిస్తానని సుమ సరదాగా చెప్పడం నవ్వులు పూయించింది.

‘లాక్‌డౌన్‌లో కూడా నా స్నేహితులు అనసూయ, రవి, ప్రదీప్‌, రష్మి అందించిన సపోర్ట్‌ వల్లే మిమ్మల్ని ఎంటర్‌టైన్‌ చేయడానికి ఈ వీడియో రూపొందించగలిగాను. ఫన్‌ను అందించడంతోపాటు విరాళాల సేకరణ కోసం మేము ఈ వీడియోను రూపొందించాం. ఈ వీడియో ద్వారా సమకూరే ఆదాయాన్ని మన తెలుగు టీవీ‌ పరిశ్రమకు చెందిన వారికి మా వంతు సాయంగా అందిస్తాం. అందరికీ ఈ వీడియో తప్పకుండా నచ్చుతుందని భావిస్తున్నాను. అందరూ ఇంట్లోనే ఉండండి, జాగ్రత్తగా ఉండండి’ అని సుమ పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని