‘రౌడీ’ ట్యాగ్‌ వెనుక కథ చెప్పిన విజయ్‌

‘అర్జున్‌ రెడ్డి’తో సెన్సేషనల్‌ హీరోగా మారారు విజయ్‌ దేవరకొండ. ఈ చిత్రంతో యువతలో ఆయన క్రేజ్‌ విపరీతంగా పెరిగింది. విజయ్‌ తన అభిమానుల్ని ఎప్పుడూ ‘రౌడీస్‌’ అని పిలుస్తుంటారు. ఇప్పటికే అనేక సందర్భాల్లో ఆయన నోటి నుంచి ఈ మాట విన్నాం. అయితే ఈ ట్యాగ్‌ వెనుక కారణం....

Published : 01 May 2020 21:14 IST

హైదరాబాద్‌: ‘అర్జున్‌ రెడ్డి’తో సెన్సేషనల్‌ హీరోగా మారారు విజయ్‌ దేవరకొండ. ఈ చిత్రంతో యువతలో ఆయన క్రేజ్‌ విపరీతంగా పెరిగింది. విజయ్‌ తన అభిమానుల్ని ఎప్పుడూ ‘రౌడీస్‌’ అని పిలుస్తుంటారు. ఇప్పటికే అనేక సందర్భాల్లో ఆయన నోటి నుంచి ఈ మాట విన్నాం. అయితే ఈ ట్యాగ్‌ వెనుక కారణం ఏంటని ఓ ఆంగ్ల మీడియా విజయ్‌ను తాజా ఇంటర్వ్యూలో ప్రశ్నించింది. దీనికి ఆయన ఆసక్తికర సమాధానం చెప్పారు.

‘నన్ను ప్రేమించే వారిని ‘ఫ్యాన్స్’‌ అని పిలవడం నాకు అసౌకర్యంగా అనిపించింది. అందుకు ప్రత్యామ్నాయంగా మరో పదం కావాలనుకున్నా. అందులోనూ నన్ను ఇష్టపడేవారంతా నా వయసు వారే అందుకే.. ‘మై రౌడీ బాయ్స్‌, మై రౌడీ గర్ల్‌’ అని పిలుస్తుంటా. అలా ఆ ట్యాగ్‌ వచ్చింది. జీవితంలో అనేక మంది మనల్ని నియంత్రించాలని చూస్తుంటారు. ఇలా చేయొద్దు, అలా ఉండొద్దు, ఇలానే చెయ్‌.. అంటుంటారు. కానీ మనకు నచ్చినట్లు మనం బతకాలని నేనంటా. అందర్నీ అలానే ఉండమని కోరుతుంటా. దీనర్థం ఇతరుల్ని నొప్పించమని కాదు, హాని చేయమని కాదు.. స్వేచ్ఛగా నచ్చినట్లు జీవించాలని. నాలోని ఆ గుణమే ఇవాళ ఈ స్థాయిలో ఉంచింది. ఇలా ‘రౌడీ’ల్లా ముందుకు వెళ్లాలని నేను సూచిస్తుంటా. అలా ఆ పదం వచ్చింది’ అని చెప్పారు.

అనంతరం విలేకరి ‘సోషల్‌మీడియాలో మీకు లక్షల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు. కానీ మీరు ఒకర్ని కూడా ఫాలో కావడం లేదు ఎందుకు?’ అని ప్రశ్నించగా.. ‘నేను ఫోన్‌లోని అప్లికేషన్స్‌ వాడను. నాకు దాని కోసం ప్రత్యేక బృందం ఉంది. వాళ్లే అంతా చూసుకుంటారు. ముఖ్యమైనవి నాకు వాట్సాప్‌ ద్వారా పంపిస్తుంటారు. నేను రిప్లై ఇస్తుంటా. నాకు సాంకేతికతపై పెద్దగా అవగాహన లేదు. జీవితంలో ఏది ముఖ్యమో వాటికే సమయం కేటాయిస్తాను. సోషల్‌ మీడియా ఎక్కువ సమయం తీసుకుంటుంది. అందుకే దానికి దూరంగా ఉంటాను’ అని విజయ్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని