
బీర్, వైన్ అందిస్తే థియేటర్లు కళకళలాడతాయా..?
ట్విటర్ వేదికగా నాగ్ అశ్విన్
హైదరాబాద్: లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా సినిమా థియేటర్లు మూతపడ్డ విషయం తెలిసిందే. షూటింగ్లు నిలిచిపోయాయి. సినిమా విడుదలలు ఆగిపోయాయి. దీంతో సినీ పరిశ్రమకు భారీగా నష్టాలు వాటిల్లాయి. అయితే లాక్డౌన్ అనంతరం థియేటర్లను పునఃప్రారంభిస్తే ప్రేక్షకులు వస్తారా? రారా? అనే విషయంలో సందేహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ ట్విటర్ వేదికగా ఓ ట్వీట్ పెట్టారు. తిరిగి ప్రారంభించిన అనంతరం ప్రేక్షకులతో థియేటర్లు కళకళలాడాలంటే ఏం చేయాలి?అని నెటిజన్లను కోరారు.
‘ప్రేక్షకులకు వైన్, బీర్ అందించే విధంగా థియేటర్లు కనుక లైసెన్స్ పొందితే సినిమా చూడడానికి వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుందా అని ఓసారి సురేశ్బాబు, రానా నేను మాట్లాడుకున్నాం. ఇలా చేస్తే థియేటర్ వ్యాపారం మెరుగుపడుతుందా? అని చర్చించుకున్నాం. ఈ విషయంపై మీరు ఏం అనుకుంటున్నారు.. ఇది మంచి ఆలోచనా? లేదా చెడు ఆలోచనా?. ఏదీ ఏమైనా ఒకటి మాత్రం నిజం.. ఒకవేళ ఈ ఆలోచననే అమలు చేస్తే సినిమా చూడడానికి వచ్చే ఫ్యామిలీ ఆడియన్స్ తగ్గిపోతారు. అంతేకాకుండా వైన్, బీర్ అందించే ఆలోచన కేవలం కొన్ని మల్టీప్లెక్స్లకు మాత్రమే పరిమితం కావొచ్చు. కానీ ఇది పూర్తి పరిష్కారం కాదు. లాక్డౌన్ తర్వాత థియేటర్లలో ప్రేక్షకుల సంఖ్య పెరగాలంటే ఏం చేస్తే బాగుంటుందో మీ అభిప్రాయాలు చెప్పండి. థియేటర్లు ఓపెన్ చేయగానే మీరు సినిమా చూడడానికి వస్తారా? లేదా ఇంకొంత కాలం వేచి చూస్తారా?’ అని నాగ్ అశ్విన్ నెటిజన్లను అడిగారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.