నా పెళ్లని నాకే చివరిగా తెలిసింది: వరలక్ష్మి

విషయం ఏదైనా సరే ముక్కుసూటిగా మాట్లాడుతుంటారు తమిళ నటి వరలక్ష్మి శరత్‌ కుమార్. ఆమె త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు వివాహం తర్వాత నటనకు స్వస్తి పలకబోతున్నారని ఊహాగానాలు వచ్చాయి. ఈ వార్తల్ని ఆమె ట్విటర్‌ వేదికగా ఖండించారు.....

Published : 19 May 2020 20:22 IST

చెన్నై: విషయం ఏదైనా సరే ముక్కుసూటిగా మాట్లాడుతుంటారు తమిళ నటి వరలక్ష్మి శరత్‌ కుమార్. ఆమె త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు వివాహం తర్వాత నటనకు స్వస్తి పలకబోతున్నారని ఊహాగానాలు వచ్చాయి. ఈ వార్తల్ని ఆమె ట్విటర్‌ వేదికగా ఖండించారు. ‘నా వివాహం జరగబోతోందనే విషయం ఎందుకు నాకే చివరిగా తెలిసింది..?? హాహాహా.. ఇవన్నీ చెత్త వదంతులు. నా పెళ్లి జరగాలని ఎందుకు అందరూ అంతగా కోరుకుంటున్నారు. ఒకవేళ నేను పెళ్లి చేసుకోబోతుంటే నా ఇంటిపైకప్పుపైకి ఎక్కి గట్టిగా అరుస్తా. అప్పుడు మీడియా నా వివాహం గురించి రాసుకోవచ్చు. నేను ఇప్పట్లో పెళ్లి చేసుకోను. నటనకు దూరం కావడం లేదు’ అని పేర్కొన్నారు.

గత కొన్నేళ్లుగా కోలీవుడ్‌లో రాణిస్తున్న వరలక్ష్మి తెలుగులో నేరుగా నటించిన సినిమా ‘తెనాలి రామకృష్ణ’. సందీప్‌ కిషన్‌ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో ఆమె ప్రతినాయకురాలిగా కనిపించారు. ప్రస్తుతం రవితేజ హీరోగా తెరకెక్కుతోన్న ‘క్రాక్‌’లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. ‘నాంది’ అనే మరో తెలుగు ప్రాజెక్టుకు కూడా సంతకం చేశారు. వీటితోపాటు ఆమె చేతిలో పలు తమిళ సినిమాలు ఉన్నాయి. మనసులోని మాటల్ని ధైర్యంగా చెప్పే గుణం అమ్మ నుంచి వచ్చిందని మాతృదినోత్సవం సందర్భంగా వరలక్ష్మి తన తల్లి ఫొటోల్ని షేర్‌ చేశారు.

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని