‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో శ్రియ.. లైవ్‌లో చెప్పేసింది..!

ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’లో కథానాయిక శ్రియ కీలక పాత్ర పోషిస్తున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆమె తన భర్త ఆండ్రీతో కలిసి స్పెయిన్‌లో ఉంటున్నారు. తాజాగా  సోషల్‌మీడియాలో లైవ్‌లో పాల్గొన్నారు. అభిమానులు ....

Updated : 15 Nov 2022 16:25 IST

15 ఏళ్ల తర్వాత..

హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’లో కథానాయిక శ్రియ కీలక పాత్ర పోషిస్తున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆమె తన భర్త ఆండ్రీతో కలిసి స్పెయిన్‌లో ఉంటున్నారు. తాజాగా  సోషల్‌మీడియాలో లైవ్‌లో పాల్గొన్నారు. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఈ క్రమంలో ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ సినిమా గురించి ఆమె ప్రస్తావించారు. ‘ఇందులో నా పాత్ర భావోద్వేగంతో కూడుకుని ఉంటుంది. ఫ్లాష్‌బ్యాక్‌లో కనిపిస్తా. అజయ్‌ దేవగణ్‌తో కలిసి షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది. లాక్‌డౌన్‌ ఎత్తేసిన తర్వాత, అంతర్జాతీయంగా విమాన సర్వీసులు ప్రారంభించిన తర్వాత సెట్స్‌కు వెళ్తానని ఆశిస్తున్నా’ అని చెప్పారు.

శ్రియ 2019లో ‘యన్‌.టి.ఆర్‌: కథానాయకుడు’లో కనిపించారు. ఇందులో సీనియర్‌ నటి ప్రభ పాత్రను పోషించారు. ప్రస్తుతం తన చేతిలో తమిళ సినిమాలు ఉన్నాయని ఇదే లైవ్‌లో ఆమె తెలిపారు. ఇటీవల ‘నరగాశురన్‌’, ‘సండక్కరీ’ షూటింగ్‌ పూర్తి చేసుకున్నట్లు పేర్కొన్నారు. దాదాపు 15 ఏళ్ల తర్వాత జక్కన్న-శ్రియ కలిసి పనిచేయబోతున్న సినిమా ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’. రాజమౌళి తెరకెక్కించిన హిట్‌ ‘ఛత్రపతి’ సినిమాలో శ్రియ కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. ప్రభాస్‌ కథానాయకుడు.

‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’లో ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ కథానాయకులుగా నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య నిర్మిస్తున్నారు. దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఇంకా 25 శాతం షూటింగ్‌ ఉందని ఇటీవల నిర్మాత తెలిపారు. లాక్‌డౌన్‌ పూర్తయిన తర్వాత హైదరాబాద్‌లో షెడ్యూల్‌ ప్రారంభిస్తామని అన్నారు. ఇందులో తారక్ కొమరం భీమ్‌గా, చెర్రీ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని