ఈ లుంగీవాలా ఏం పాడతాడులే !

నవశక్తి ప్రొడక్షన్స్‌ వారు ఎన్టీఆర్‌, వాణిశ్రీ, శారద ప్రధాన తారాగణంగా సి.ఎస్‌. రావు దర్శకత్వంలో జీవిత చక్రం (విడుదల 31-3-1971) చిత్రాన్ని నిర్మించేందుకు

Updated : 25 Jan 2021 17:21 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నవశక్తి ప్రొడక్షన్స్‌ వారు ఎన్టీఆర్‌, వాణిశ్రీ, శారద ప్రధాన తారాగణంగా సి.ఎస్‌. రావు దర్శకత్వంలో జీవిత చక్రం (విడుదల 31-3-1971) చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్న రోజులవి. కొత్తదనం కోసం ప్రఖ్యాత హిందీ సంగీత దర్శకులైన శంకర్‌-జైకిషన్‌ను ఆ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చమని కోరారు. ఆరుద్ర, డా||సి.నా.రె పాటలు రాశారు. బొంబాయిలో పాటల రికార్డింగ్‌ కోసం మద్రాస్‌ నుంచి గాయనీ గాయకుల్ని పిలిపించారు. విమానంలో ఘంటసాల బొంబాయి చేరుకున్నారు. శంకర్‌-జైకిషన్‌లు ఘంటసాలకి స్వాగతం పలికారు. శంకర్‌ హైదరాబాద్‌కు చెందిన వాడు కావడంతో ఆయనకు తెలుగు భాష తియ్యదనం, ఘంటసాల గొప్పదనం వగైరాలు తెలుసు.

ఘంటసాల రికార్డింగ్‌ థియేటర్‌లోకి అడుగు పెట్టగానే అక్కడున్న బొంబాయి ఆర్కెస్ట్రా జనం ఆశ్చర్యపోయారు. కారణం ఘంటసాల వేషధారణ అతి సామాన్యంగా ఉంది. తెల్లని లాల్చీ, లుంగీ, సాధారణమైన ఆకు చెప్పులతో ఉన్న ఘంటసాలలో సెలెబ్రిటీ లక్షణాలు బొత్తిగా కనిపించలేదు. ఆయన్ని చూడగానే ‘ఈ లుంగీవాలా ఏం పాడతాడు లే!’ అని బొంబాయి వాలాలు గుసగుసలుపోయారట. ఘంటసాల తెలుగు పాటల్ని పరిశీలించారు. శంకర్‌-జైకిషన్లతో మాట్లాడి ట్యూన్స్‌ తెలుసుకొన్నారు. చిన్న రిహార్సల్‌ వేసుకొని, రెడీ అంటూ టేక్‌ కోసం మైక్‌ ముందు నిల్చున్నారు. రికార్డింగ్‌ థియేటర్లో సైలెన్స్‌... ఘంటసాల తన గంభీరమైన గొంతును విప్పారు.

బొంబాయిలోని అత్యంత ఆధునికమైన రికార్డింగ్‌ యంత్రాలు ఒక్కసారి ప్రతిధ్వనించాయి. అంత వరకు ఈ లుంగీ వాలా ఏం పాడతాడు లే! అని లైట్‌ గా తీసుకొన్న బొంబాయి ఆర్కెస్ట్రా వారికి చెవిలో సముద్రపు హోరులాగా ఘంటసాల మాస్టారి గొంతు వినిపించింది. రికార్డింగ్‌ పూర్తయింది. పాట బ్రహ్మాండంగా వచ్చిందంటూ శంకర్‌-జైకిషన్లు ఘంటసాలని అభినందించారు. దాంతో తల దించుకోవడం ఆర్కెస్ట్రా సభ్యుల వంతయింది. ఇందులో ఘంటసాల మొత్తం నాలుగు పాటలు పాడారు. ‘కళ్లలో కళ్లు పెట్టి చూడు’, ‘మధురాతి మధురం మన ప్రేమ’, ‘సుడి గాలిలోన దీపం కడవరకూ’, ‘కంటి చూపు చెబుతోంది’ పాటలు ఆల్‌టైమ్‌ హిట్‌గా నిలిచాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని