Goodbye: చావు ఒక్కసారే వస్తుంది.. ఎమోషనల్‌గా ‘గుడ్‌ బై’ ట్రైలర్‌

అమితాబ్‌ బచ్చన్‌, రష్మిక ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘గుడ్‌బై’. ఈ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. ఎవరెవరు? ఎలా కనిపించారంటే?

Published : 06 Sep 2022 16:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్: కథానాయిక రష్మిక (Rashmika) బాలీవుడ్‌లో నటించిన తొలి చిత్రం ‘గుడ్‌ బై’ (GoodBye). ఈ సినిమాలో ఆమె ప్రముఖ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan) తనయగా నటించింది. అక్టోబరు 7న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న నేపథ్యంలో చిత్రం బృందం తాజాగా ట్రైలర్‌ని విడుదల చేసింది. పుట్టిన రోజులు ఎన్నో ఉంటాయి కానీ చావు ఒక్కసారే వస్తుంది.. ఏ మనిషి పోయినా అంత్యక్రియలను వేడుకగా జరిపించాలని చెప్పే కథాంశంతో దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కించినట్టు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. భార్య మరణ వార్తను విదేశాల్లో ఉండే తనయులకు అమితాబ్‌ తెలియజేటం, వారు ఏదో పని ఉందంటూ తప్పించుకునే ప్రయత్నం చేయటం.. చివరగా అంత్యక్రియలు జరిపించటం.. తదితర సన్నివేశాలు భావోద్వేగానికి గురిచేస్తాయి.

ఎమోషనే కాదు ఈ చిత్రంలో మంచి వినోదం ఉన్నట్టు కొన్ని సీన్స్‌ని బట్టి తెలుస్తోంది. ఎవరిపైనా ఆధారపడకుండా జీవించాలనుకునే కూతురిగా రష్మిక, అలా చేస్తే తనను అవమానించినట్టే అనే ఫీలయ్యే తండ్రిగా అమితాబ్‌ మధ్య సాగే చర్చ నవ్వులు పంచేలా ఉంది. వికాస్‌ బహల్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నీనా గుప్త, సాహిల్‌ మెహతా, శివిన్‌ నారంగ్‌ ఇతర పాత్రలు పోషించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని