Tollywood: కొత్త కబురు... సరికొత్త జోరు

విడుదలలు ఆగిపోయాయి. చిత్రీకరణలు నత్తనడకన సాగుతున్నాయి. రెండేళ్లుగా సినిమాలకి అడుగడుగునా అనుకోని అవాంతరాలే! అయినా సరే... కొత్త సినిమాల విషయంలో మన హీరోల ఉత్సాహం

Published : 29 Jan 2022 14:30 IST

విడుదలలు ఆగిపోయాయి. చిత్రీకరణలు నత్తనడకన సాగుతున్నాయి. రెండేళ్లుగా సినిమాలకి అడుగడుగునా అనుకోని అవాంతరాలే! అయినా సరే... కొత్త సినిమాల విషయంలో మన హీరోల ఉత్సాహం కొనసాగుతోంది. మూడో దశ కరోనాతో చిత్రసీమలో మరోసారి ఒడుదొడుకులు కొనసాగుతున్న నేటి పరిస్థితుల్లోనూ కొందరు హీరోలు కొత్త సినిమాల్ని ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నారు. పలు కొత్త కలయికలు ప్రచారంలో ఉన్నాయి. ప్రేక్షకుల్ని ఊరిస్తున్నాయి.

కరోనా పరిస్థితుల్ని ఎదుర్కోవడం తెలుగు చిత్రసీమకి అలవాటైపోయింది. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ చిత్రీకరణల్ని కొనసాగించడం...కరోనా తగ్గుముఖం పడుతోందనే సంకేతాలు కనిపించగానే కొత్త సినిమాల్ని విడుదల చేయడం... అలా మిగతా పరిశ్రమలతో పోలిస్తే తెలుగు చిత్రసీమ కరోనా సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటోంది. మన సినిమాలకి దేశవ్యాప్తంగా ఆదరణ లభిస్తున్న కీలక సమయం కూడా ఇదే. దేశం మొత్తం తెలుగు కథలు, కథానాయకులవైపే చూస్తోంది. దాంతో మన హీరోలంతా అనుకూలమైన ఈ పరిస్థితుల్ని సద్వినియోగం చేసుకోవడంపై దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. మార్కెట్‌కి, డిమాండ్‌కి అనుగుణంగానే కొత్త సినిమాలకి వెంట వెంటనే ఓకే చెప్పేస్తున్నారు. ఒకొక్క హీరో దగ్గర చేయాల్సిన సినిమాల జాబితా చాంతాడంత ఉన్నప్పటికీ మరో కథ వినేందుకు సిద్ధపడుతున్నారు. అగ్ర కథానాయకులు బాలకృష్ణ, ప్రభాస్‌, అల్లు అర్జున్‌, విజయ్‌ దేవరకొండ తదితరుల కోసం కొత్తగా కథలు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఆయా కథానాయకులకి సంబంధించిన పలు సినిమాలు ప్రచారంలో ఉన్నాయి.

* ‘అఖండ’తో విజయాన్ని అందుకున్న బాలకృష్ణ, తదుపరి గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి  తెలిసిందే. ఆ తర్వాత అనిల్‌ రావిపూడి దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయడానికి పచ్చజెండా ఊపారు బాలకృష్ణ. ఈ రెండు సినిమాల తర్వాత గీతా ఆర్ట్స్‌ సంస్థ కూడా బాలకృష్ణతో ఓ సినిమా చేయబోతోందని, అందుకోసం దర్శకుల నుంచి కథలు కూడా ఆహ్వానిస్తోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. పలువురు యువ దర్శకులు బాలకృష్ణ కోసం కథలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.

* ప్రభాస్‌ చేతిలో చాలా సినిమాలున్నాయి. ఆయన నటించిన ‘రాధేశ్యామ్‌’ కూడా విడుదల కావల్సి ఉంది. ‘సలార్‌’, ‘ఆదిపురుష్‌’ చిత్రాలు చేస్తున్న ఆయన,  నాగ్‌ అశ్విన్‌తో ‘ప్రాజెక్ట్‌ కె’, సందీప్‌ వంగాతో కలిసి ‘స్పిరిట్‌’ సినిమాల్ని కూడా పూర్తి చేయాల్సి ఉంది. మరో బాలీవుడ్‌ దర్శకుడు ఆనంద్‌ శంకర్‌తోనూ ప్రభాస్‌ ఓ సినిమా చేయనున్నారని తెలిసింది. ఇన్ని ప్రాజెక్టులు లైన్లో ఉన్నప్పటికీ ఇటీవల మరో టాలీవుడ్‌ దర్శకుడితో ప్రభాస్‌ సినిమా చేయడానికి పచ్చజెండా ఊపారని వినిపించింది. ప్రభాస్‌తో సినిమాలు చేయడం కోసం టాలీవుడ్‌కి చెందిన పలు అగ్ర నిర్మాణ సంస్థలు ప్రణాళికలు రచించాయి. ఆ సంస్థల్లో చేయాల్సిన సినిమాల కోసమే ప్రభాస్‌ ప్రస్తుతం కొత్త కథలు వింటున్నారని తెలిసింది. వీటితోపాటు బాలీవుడ్‌కి చెందిన ప్రముఖ నిర్మాత కరణ్‌జోహార్‌ ఓ తెలుగు దర్శకుడితో కలిసి మరో ప్రాజెక్ట్‌ సెట్‌ చేశారని సమాచారం.

* ‘పుష్ప’తో తిరుగులేని విజయాన్ని అందుకున్న అల్లు అర్జున్‌ చేతిలోనూ రెండు సినిమాలు ఉన్నాయి. ‘పుష్ప2’ కోసం త్వరలోనే రంగంలోకి దిగనున్నారు. ఆ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. గీతా ఆర్ట్స్‌ సంస్థలో రూపొందనున్న ఆ సినిమా కోసం ఇప్పటికే పనులు మొదలైనట్టు తెలుస్తోంది. ఆ రెండు సినిమాలతోపాటు తాజాగా తమిళ దర్శకుడు అట్లీ కూడా అల్లు అర్జున్‌కి కథ చెప్పారని ప్రచారం సాగుతోంది. ‘పుష్ప’తో అల్లు అర్జున్‌ విజయవంతంగా పాన్‌ ఇండియా మార్కెట్‌ని సొంతం చేసుకున్నారు. ఇకపై ఆయన ఆ మార్కెట్‌ని దృష్టిలో ఉంచుకునే కథలు ఎంచుకోనున్నారని, అందులో భాగంగానే అట్లీతో సినిమా చేయడానికి ఆయన సిద్ధమవుతున్నారని ప్రచారం సాగుతోంది. ‘లైగర్‌’ చేస్తున్న విజయ్‌ దేవరకొండ - పూరి జగన్నాథ్‌ కలయికలో మరో సినిమా కూడా ప్రచారంలోకి వచ్చింది. ఈ ఏడాదిలోనే ఈ ఇద్దరూ మరో సినిమాని మొదలు పెడుతున్నారని, అందుకోసం అంతా సెట్‌ అయ్యిందని టాలీవుడ్‌ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. కొత్త సినిమాల విడుదల మాటేమో కానీ... కొత్త కలయికలకి సంబంధించిన కబుర్లు మాత్రం ప్రేక్షకుల్లో కావల్సినంత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని