Gunasekhar: ఇది సమంత శాకుంతలం

‘‘బాహుబలి’తో తెలుగు సినిమాని పాన్‌ ఇండియా స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో దాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు.

Updated : 29 Mar 2023 07:00 IST

గుణశేఖర్‌

‘‘బాహుబలి’తో తెలుగు సినిమాని పాన్‌ ఇండియా స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో దాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు. అలాగే తెలుగు చిత్రాల్ని ఇంకా ప్రపంచానికి చూపిస్తూ ఉండాలనే ఉద్దేశంతో నేను వేసిన తొలి అడుగు ఈ ‘శాకుంతలం’’ అన్నారు నిర్మాత దిల్‌రాజు (Dil Raju). ఆయన సమర్పణలో సమంత ప్రధాన పాత్రధారిగా గుణశేఖర్‌ తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రమే ‘శాకుంతలం’. కాళిదాసు రచించిన సంస్కృత నాటకం అభిజ్ఞాన శాకుంతలం (Shaakuntalam) ఆధారంగా దీన్ని త్రీడీలో రూపొందించారు. నీలిమ గుణ నిర్మాత. ఈ సినిమా ఏప్రిల్‌ 14న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్‌లో త్రీడీ ట్రైలర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా గుణశేఖర్‌ మాట్లాడుతూ.. ‘‘ఇది సమంత శాకుంతలం. ఈ చిత్రం వెనకాల మొత్తం తనే ఉంది. ఆమె ప్రాణం పెట్టి శకుంతల పాత్రకు ప్రాణ ప్రతిష్ఠ చేసింది. దాన్ని రేపు మీరు తెరపై తొలి సీన్‌ నుంచి చివరి సన్నివేశం వరకు అనుభూతి చెందుతారు. ఇప్పుడదే మచ్చుకు ట్రైలర్‌లో చూశారు. ఇక ఇప్పుడేం మాట్లాడను. ఏప్రిల్‌ 14న సినిమా చూపించాక ప్రేక్షకుల స్పందనను వినాలనుకుంటున్నా’’ అన్నారు. ‘‘ఈ సినిమా నవ్విస్తుంది. ఏడిపిస్తుంది. ఆలోచింపజేస్తుంది. ఒక అద్భుతమైన చిత్రం చూశామన్న అనుభూతి పంచి థియేటర్‌ నుంచి బయటకు పంపిస్తుంది’’ అన్నారు రచయిత సాయిమాధవ్‌ బుర్రా. చిత్ర సమర్పకులు దిల్‌రాజు మాట్లాడుతూ.. ‘‘సమంతతో గుణశేఖర్‌ చిత్రం చేయాలనుకున్నప్పుడు ఇందులో నేను లేను. గ్లోబల్‌ సినిమా గురించి తెలుసుకోవడానికి, వీఎఫ్‌ఎక్స్‌ నేర్చుకోవడానికి ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యాను. ఇదొక అందమైన ఫ్యామిలీ డ్రామా. విజువల్‌ వండర్‌లా తీర్చిదిద్దారు. సినిమా ఆద్యంతం ఎక్కడా బోర్‌ కొట్టించదు. ఈ చిత్రం చూసి బయటకొచ్చేటప్పుడు అల్లు అర్హ రూపంలో ఓ సర్‌ప్రైజ్‌ ఉంటుంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రం ద్వారా మన సంస్కృతిని వేడుక చేసుకుంటున్నాం. దీన్ని త్రీడీలోకి మార్చాలన్న ఆలోచన దిల్‌రాజుదే. అందుకు ఆయనకు కృతజ్ఞతలు’’ అన్నారు నిర్మాత నీలిమ గుణ. ఈ కార్యక్రమంలో చైతన్య ప్రసాద్‌, ప్రవీణ్‌ పూడి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని