Prabhas: సినిమాలో సగం బడ్జెట్‌ ఆ సన్నివేశాల కోసమేనా?

ఇప్పటికే రెండు మేజర్‌ షెడ్యూల్స్‌ పూర్తి చేసుకున్న ‘సలార్‌’ త్వరలోనే మూడో షెడ్యూల్‌కు సిద్ధమవుతోంది.

Published : 14 Sep 2021 15:30 IST

హైదరాబాద్‌: ‘బాహుబలి’ చిత్రాలతో పాన్‌ ఇండియా స్టార్‌ అయిపోయారు ప్రభాస్. ఆ తర్వాత ‘సాహో’ బాలీవుడ్‌లో ఆయనకు మంచి క్రేజ్‌ తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభాస్‌ చేస్తున్న చిత్రాలన్నీ భారీ బడ్జెట్‌, పాన్‌ ఇండియా సినిమాలే కావటం విశేషం. కాగా, తాజాగా ఓ ఆసక్తికర వార్త చిత్ర పరిశ్రమలో చక్కర్లు కొడుతోంది. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘సలార్‌’. ఇప్పటికే రెండు మేజర్‌ షెడ్యూల్స్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే మూడో షెడ్యూల్‌కు సిద్ధమవుతోంది.

తాజా షెడ్యూల్‌లో భారీ యాక్షన్‌ సన్నివేశాలను తెరకెక్కించనున్నారట. ఇవి సినిమాకే హైలైట్‌గా నిలవనున్నాయని సమాచారం. ఇందుకోసం చిత్ర బృందం భారీగానే ఖర్చుచేస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా మొత్తం బడ్జెట్‌లో దాదాపు సగం ఈ యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణ కోసమే ఖర్చు చేస్తున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ‘కేజీయఫ్‌’తో తన సత్తా ఏంటో చూపిన ప్రశాంత్‌ నీల్‌.. ప్రభాస్‌ను ఇంకెంత మాస్‌, పాన్‌ ఇండియా స్టార్‌గా చూపిస్తారో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

మరోవైపు ప్రభాస్‌, పూజా హెగ్డే జంటగా నటించిన ‘రాధేశ్యామ్‌’ విడుదలకు సిద్ధమవుతోంది. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. దీంతోపాటు, ఓం రౌత్‌ దర్శకత్వంలో ‘ఆది పురుష్‌’లోనూ ప్రభాస్‌ మెయిన్‌రోల్‌ పోషిస్తున్నారు. ఈ సినిమాల తర్వాత నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కే భారీ బడ్జెట్‌ చిత్రంలో ప్రభాస్‌ నటించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని