ధర్మేంద్రతో మాట్లాడనివ్వలేదు: హేమమాలిని

అలనాటి బాలీవుడ్‌ నటి హేమమాలిని, నటుడు ధర్మేంద్ర ఎన్నో సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. బాలీవుడ్‌లో తెరకెక్కిన పలు చిత్రాల కోసం కలిసి పనిచేసిన ఈ జంట హిట్‌ పెయిర్‌గా ప్రేక్షకాదరణ పొందారు....

Published : 05 Mar 2021 01:19 IST

ముంబయి: అలనాటి బాలీవుడ్‌ నటి హేమమాలిని, నటుడు ధర్మేంద్ర ఎన్నో సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. బాలీవుడ్‌లో తెరకెక్కిన పలు చిత్రాల కోసం కలిసి పనిచేసిన ఈ జంట హిట్‌ పెయిర్‌గా ప్రేక్షకాదరణ పొందింది. కాగా, ఓ ప్రముఖ రియాల్టీ షోకి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన హేమమాలిని తాజాగా తన ప్రేమకథ గురించి ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. ఒకానొక సందర్భంలో తనని ధర్మేంద్రకు దూరంగా ఉంచాలని హేమ తండ్రి భావించారట.

‘ధర్మేంద్ర, నేనూ కలిసి చాలా సూపర్‌హిట్‌ సినిమాల్లో నటించాం. మేమిద్దరం కలిసి తరచూ సినిమాలు చేయడంతో మా ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఆ విషయం మా ఇంట్లోవాళ్లకి తెలిసింది. అయితే, సాధారణంగా నేను ఏదైనా షూట్‌లో పాల్గొంటే.. నా వెంట అమ్మ లేదా బామ్మ సెట్‌కు వచ్చేవాళ్లు. కానీ, ఓసారి మాత్రం ధర్మేంద్రతో సినిమా చేస్తున్న సమయంలో నాతోపాటు నాన్న సెట్‌కు వచ్చారు. షూట్‌ అయ్యేంత వరకూ నాతోనే ఉన్నారు. ధర్మేంద్రతో మాట్లాడనివ్వలేదు. అలా మా ఇద్దర్నీ దూరంగా ఉంచాలని ఆయన భావించారు’’ అని ఆమె ఆనాటి రోజుల్ని గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం రాజకీయ నాయకురాలిగా రాణిస్తున్న హేమమాలిని అప్పుడప్పుడు సినిమాల్లోన మెప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే దాదాపు రెండేళ్ల క్రితం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’లో ఆమె బాలయ్య తల్లి పాత్రలో కనిపించారు. ఇక తాజా సమాచారం ప్రకారం.. ప్రభాస్ హీరోగా తెరకెక్కనున్న ‘ఆదిపురుష్‌’లో ఆమె రాముడి తల్లి కౌసల్యగా కనిపించనున్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని