RRR: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’పై ఏపీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు.. కారణమేమిటంటే..!

రామ్‌చరణ్‌ ‘అల్లూరి సీతారామరాజు’గా, ఎన్టీఆర్‌ ‘కొమురం భీమ్‌’గా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (రౌద్రం, రణం, రుధిరం). ఈనెల 7న విడుదల కావాల్సి ఉండగా.. కరోనా పరిస్థితుల దృష్ట్యా వాయిదా పడింది.

Published : 18 Jan 2022 15:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రామ్‌చరణ్‌ ‘అల్లూరి సీతారామరాజు’గా, ఎన్టీఆర్‌ ‘కొమురం భీమ్‌’గా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (రౌద్రం, రణం, రుధిరం). ఈనెల 7న విడుదల కావాల్సి ఉండగా.. కరోనా పరిస్థితుల దృష్ట్యా వాయిదా పడింది. తాజాగా ఈ చిత్రం మరోసారి వార్తల్లో నిలిచింది. ‘ఆర్‌ఆర్‌ఆర్’లో అల్లూరి సీతారామరాజు చరిత్రను వక్రీకరించిన కారణంగా ఏపీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసినట్లు అల్లూరి యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు వీరభద్రరావు తెలిపారు. చిత్రంలో అభూత కల్పనలు వద్దని.. విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు చరిత్రను వక్రీకరిస్తే సహించమన్నారు. బిట్రీష్‌ వారికి వ్యతిరేకంగా పోరాడిన సీతారామరాజును బ్రిటిష్‌ పోలీసుగా చూపించడం దారుణమని... ఇదే విషయంపై సినిమా నిర్మాతలపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశామన్నారు. అల్లూరి, కొమురం భీమ్‌ కలిసినట్లు చరిత్రలో ఎక్కడా లేదని, అలాంటిది.. ఆ ఇద్దరినీ కలిపి సినిమాగా తీయడం సరికాదన్నారు. రాజమౌళి చరిత్రను మారుస్తున్నారని... అలా చిత్రీకరించి భావితరాలకు తప్పుడు సమాచారం ఇవ్వడంతో పాటు చరిత్రను భ్రష్టుపట్టిస్తున్నారన్నారు.

‘ఆర్ఆర్‌ఆర్‌’ కేవలం కల్పిత కథ అని, స్వాతంత్య్ర పోరాటంలో ఆ ఇద్దరు మహావీరులు కలిసి పోరాటం చేస్తే ఎలా ఉంటుందనే కోణంలో రూపొందిస్తున్నామని రాజమౌళి వివరణ ఇచ్చినప్పటికీ చరిత్రను వక్రీకరించకూడదన్నారు. ఇప్పటికైనా అల్లూరి సీతారామరాజు చరిత్రను వక్రీకరిస్తూ తెరకెక్కించిన ఘట్టాలను సినిమా నుంచి వెంటనే తొలగించాలని వీరభద్రరావు డిమాండ్‌ చేశారు. కాగా కొన్ని రోజుల క్రితం అల్లూరి సౌమ్య తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన సంగతి తెలిసిందే.  అల్లూరి, కొమురంభీం జీవన విధానాలకు విరుద్ధంగా ఈ సినిమాను చిత్రీకరించడం చట్ట విరుద్ధమని ఆమె పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై పూర్తిస్థాయి విచారణ జరగాల్సి ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని