Kantara2: ఉగాది సందర్భంగా క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చిన రిషబ్‌శెట్టి

Kantara2: ఉగాది సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ హోంబాలే ఫిల్మ్స్‌ ‘కాంతార2’కు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని పంచుకుంది.

Updated : 22 Mar 2023 20:29 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కన్నడంలో విడుదలై దేశవ్యాప్తంగా కాసుల వర్షాన్ని కురిపించిన మూవీ ‘కాంతార’ (Kantara). రిషబ్‌శెట్టి (Rishab Shetty) స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా మరో చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలో కథానాయకుడు రిషబ్‌శెట్టి ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ఉగాది సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు చెబుతూ, ‘దేశ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. కాంతార రచన మొదలైంది’ అని ట్వీట్‌ చేశారు.

‘కాంతార2’ (Kantara2) సినిమాకు సంబంధించి కీలకమైన అప్‌డేట్‌ను రిషబ్‌శెట్టి పంచుకోవడంతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ హోం బాలే ఫిల్మ్స్‌ కూడా పంచుకుంది. ‘శుభప్రదమైన ఉగాది, కొత్త సంవత్సరాదిన ఈ విషయాన్ని పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. కాంతార2 స్క్రిప్ట్‌ పనులు మొదలయ్యాయి. ప్రకృతితో ఉన్న మనోహరమైన అనుబంధాన్ని మీ ముందుకు తీసుకొచ్చేందుకు ఉవ్విళ్లూరుతున్నాం’ అని పేర్కొంది. మొదటి భాగంతో పోలిస్తే, రెండో భాగానికి బడ్జెట్‌ పరిమితిని హోంబాలే ఫిల్మ్స్‌ పెంచినట్లు సమాచారం. అదే సమయంలో మేకింగ్‌ స్టైల్‌, కథాగమనం ‘కాంతార’లో చూసినట్లే వాస్తవానికి దగ్గరగా ఉంటుందట. ఇక ఈ సినిమాలో కొత్త నటీనటులు కనిపించనున్నారు. బిగ్‌స్టార్స్‌ ఇందులో భాగస్వామి అవుతున్నట్లు తెలుస్తోంది. ఒకానొక దశలో రజనీకాంత్‌ పేరు కూడా వినిపించింది. అయితే, దీనిపై చిత్ర బృందం నుంచి ఎలాంటి అప్‌డేట్‌ లేదు. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. రిషబ్‌శెట్టి దర్శకత్వంలో రూపొందిన ‘కాంతార’ బాక్సాఫీస్‌ వద్ద రూ.400కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని