Adivi Sesh: ‘కర్మ’పై అడివి శేష్‌ ఆసక్తికర ట్వీట్‌.. ఆయనతో పనిచేయడం గర్వంగా ఉందంటూ..

తన తొలి చిత్రం ‘కర్మ’ గురించి ట్విటర్‌ వేదికగా పలు విశేషాలు పంచుకున్నారు హీరో అడివి శేష్‌. సినిమాటోగ్రాఫర్‌ జేమ్స్‌ ప్రతిభను కొనియాడారు.

Published : 04 Jun 2023 22:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓ వైపు హీరోగా, మరోవైపు రచయిత, దర్శకుడిగా రాణిస్తున్న నటుల్లో అడివి శేష్‌ (adivi sesh) ఒకరు. థ్రిల్లర్‌ నేపథ్య సినిమాల విషయంలో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. స్వీయ దర్శకత్వంలో తాను నటించిన తొలి సినిమా ‘కర్మ’ (karma)పై తాజాగా ట్వీట్‌ చేశారు. దాని గురించి పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. 

హాలీవుడ్‌ ఫిల్మ్‌ ‘మూన్‌లైట్‌’ (moonlight)కి గాను ఆస్కార్‌కు నామినేట్‌ అయిన సినిమాటోగ్రాఫర్‌ జేమ్స్‌ లాక్స్‌టన్‌ (james laxton).. తెలుగు సినిమాకి పనిచేశారంటూ ఓ ట్విటర్‌ హ్యాండిల్‌ పేర్కొనగా దాన్ని రీట్వీట్‌ చేసిన శేష్‌ నాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు. ‘‘జేమ్స్‌ అద్భుతమైన సినిమాటోగ్రాఫర్‌. ఆయనతో కలిసి నా తొలి సినిమా ‘కర్మ’కు పనిచేయడం గర్వంగా ఉంటుంది. మేం షూటింగ్‌ ప్రారంభించినప్పుడు.. రెడ్‌ కెమెరా (ది రెడ్‌ వన్‌ సిస్టమ్‌)తో చిత్రీకరించిన తొలి తెలుగు సినిమా ఇదే. కానీ, కమల్‌హాసన్‌ (kamal haasan) గారి ‘ఈనాడు’ (eenadu) చిత్రం ముందుగా విడుదలైంది. జేమ్స్‌ దగ్గర రెండు లైట్లు ఉండేవి. వాటితోనే అంతటి పెద్ద కెమెరాను హ్యాండిల్‌ చేసేవాడు. అతడికి ఒక్క సహాయకుడు మాత్రమే ఉండేవాడు. లైట్లు, ఎలక్ట్రిసిటీకి సంబంధించిన పనులన్నీ వారిద్దరే చూసుకునేవారు. ఇప్పుడు ప్రపంచంలోనే టాప్‌ 10 సినిమాటోగ్రాఫర్‌ జాబితాలో జేమ్స్‌ ఉన్నాడు’’ అని చెప్పారు. అమెరికాలోనే పూర్తిగా షూటింగ్‌ చేసిన తొలి తెలుగు సినిమాగా ‘కర్మ’ నిలిచింది. 2010 నవంబరు 15న ప్రేక్షకుల ముందుకొచ్చింది.

‘ది అండర్‌గ్రౌండ్‌ రైల్‌రోడ్‌’, ‘ఇఫ్‌ బీల్‌స్ట్రీట్‌ కుడ్‌టాక్‌’, ‘ది వైలెంట్‌ కైండ్‌’, ‘కాలిఫోర్నియా సోలో’, ‘క్యాంప్‌ ఎక్స్‌-రే’, ‘ఎనీథింగ్‌’ వంటి హాలీవుడ్‌ చిత్రాలకు జేమ్స్‌ డీవోపీగా పనిచేశారు. శేష్‌ విషయానికొస్తే.. ‘క్షణం’, ‘గూఢచారి’, ‘ఎవరు’ తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతి పంచిన ఆయన గతేడాది ‘మేజర్‌’, ‘హిట్‌: సెకండ్‌ కేస్‌’లతో అలరించారు. ప్రస్తుతం ‘గూఢచారి 2’ పనుల్లో నిమగ్నమయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు