Cinema News: యువ నాయిక.. పాన్‌ ఇండియా ప్రేమిక

ఇప్పుడంతా పాన్‌ ఇండియా ట్రెండ్‌. అగ్ర కథానాయకుల నుంచి..  కుర్ర హీరోల వరకు అందరూ ఇదే పంథాలో నడుస్తున్నారు. మంచి కథ కుదిరిందంటే చాలు.. హిందీ సహా నాలుగైదు భాషల్లో విడుదల చేసి సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడీ ఫీవర్‌...

Updated : 13 May 2022 13:58 IST

ఇప్పుడంతా పాన్‌ ఇండియా ట్రెండ్‌. అగ్ర కథానాయకుల నుంచి..  కుర్ర హీరోల వరకు అందరూ ఇదే పంథాలో నడుస్తున్నారు. మంచి కథ కుదిరిందంటే చాలు.. హిందీ సహా నాలుగైదు భాషల్లో విడుదల చేసి సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడీ ఫీవర్‌ కథానాయికల్ని పట్టుకుంది. అనుష్క, సమంత, కీర్తి సురేష్‌ వంటి అగ్ర కథానాయికలంతా ఇప్పటికే పాన్‌ ఇండియా కథలతో అదృష్టం పరీక్షించుకున్నారు. ఇప్పుడీ రేసులోకి కొత్తతరం నాయికలు వచ్చి చేరుతున్నారు. మెరుపులు మెరిపించేందుకు సెట్స్‌పై చకచకా ముస్తాబవుతున్నారు.

ప్రస్తుతం టాలీవుడ్‌లో పాన్‌ ఇండియా కథలకు చిరునామాగా  నిలుస్తున్న కథానాయిక సమంత.  ‘ది ఫ్యామిలీమెన్‌ 2’ సిరీస్‌తో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న ఆమె.. ప్రస్తుతం రెండు పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌లతో బిజీ బిజీగా గడిపేస్తోంది. గుణశేఖర్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘శాకుంతలం’   విడుదలకు సిద్ధమవుతుండగా.. యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ‘యశోద’ తుది దశ చిత్రీకరణలో ఉంది. కెరీర్‌ ఆరంభం నుంచీ నటనా ప్రాధాన్యమున్న పాత్రలతోనే అలరిస్తూ వస్తోంది నటి సాయి పల్లవి. కథల ఎంపికలో ఆచితూచి వ్యవహరించే ఈ అమ్మడు.. ఇప్పుడు ఓ బహు భాషా చిత్రానికి పచ్చజెండా ఊపింది. గౌతమ్‌ రామచంద్రన్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాకి ‘గార్గి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇటీవలే సాయిపల్లవి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర గ్లింప్స్‌ను విడుదల చేశారు.  ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోన్న ఈ సినిమా.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.


తొలి అడుగులోనే..

‘అందాల రాక్షసి’గా వెండితెరపై మెరిసిన సుందరి లావణ్య త్రిపాఠి. ఇన్నాళ్లు గ్లామర్‌ నాయికగా తెరపై జోరు చూపించిన ఈ అమ్మడు.. ఇప్పుడు పంథా మార్చింది. నాయికా ప్రాధాన్య కథలతో సత్తా చాటేందుకు సిద్ధమైంది. తొలి ప్రయత్నంగా ‘హ్యాపీ బర్త్‌డే’ అంటూ నేరుగా పాన్‌ ఇండియా మార్కెట్‌కు నిచ్చెన వేసింది. ‘మత్తు వదలరా’ ఫేమ్‌ రితేష్‌ రానా తెరకెక్కిస్తున్న చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్‌, క్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. యాక్షన్‌ ప్రాధాన్యమున్న క్రైమ్‌ కామెడీ కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రం.. ప్రస్తుతం ముగింపు దశలో ఉంది. దీన్ని పాన్‌ ఇండియా సినిమాగా జులై 15న ఒకేసారి పలు భాషల్లో విడుదల చేయనున్నారు.


శ్రద్ధా.. పాన్‌ ఇండియా ‘విట్‌నెస్‌’

‘జెర్సీ’ సినిమాతో సారాగా అందరి మదిలో గుర్తుండిపోయిన నాయిక శ్రద్ధా శ్రీనాథ్‌. ఓవైపు రెగ్యులర్‌ కమర్షియల్‌ చిత్రాల్లో నటిస్తూనే.. మరోవైపు నాయిక ప్రాధాన్య కథలతోనూ మెప్పించే ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడామె నుంచి వస్తున్న తొలి పాన్‌ ఇండియా చిత్రం ‘విట్‌నెస్‌’. దీపక్‌ దర్శకుడు. రోహిణి మరో కీలక పాత్రలో నటిస్తోంది. పారిశుద్ధ్య కార్మికుల చుట్టూ అల్లుకున్న ఆసక్తికర కథాంశంతో రూపొందుతోంది. బలమైన భావోద్వేగాలకు ఆస్కారముంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణాంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దీన్ని త్వరలో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నారు.


‘డ్రైవర్‌ జమున’గా..

శ్వర్య విభిన్నమైన నటనా ప్రాధాన్య పాత్రలు ఎంచుకుంటూ.. ఇటు తెలుగులోనూ అటు తమిళంలోనూ వరుస విజయాలు అందుకుంటోన్న కథానాయిక ఐశ్వర్య రాజేశ్‌. ప్రస్తుతం నాయికా ప్రాధాన్య సినిమాలతో జోరు చూపిస్తోన్న ఈ తెలుగందం.. ఇప్పుడు ‘డ్రైవర్‌ జమున’గా పాన్‌ ఇండియా స్థాయిలో అదృష్టం పరీక్షించుకునేందుకు  సిద్ధమైంది. ఓ లేడీ క్యాబ్‌ డ్రైవర్‌ జీవితంలో జరిగిన నాటకీయ సంఘటనల నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగుతుంది. పూర్తి రోడ్‌ జర్నీ   సినిమాగా రూపొందుతోన్న ఈ చిత్రానికి పా.కిన్ల్సిన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం తుది దశ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని