#Indian2 హైకోర్టులో డైరెక్టర్‌ శంకర్‌కు ఊరట

‘ఇండియన్‌2’ వివాదంలో డైరెక్టర్‌ శంకర్‌కు లభించింది. ఆయనపై ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ వేసిన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టును కొట్టివేసింది. దీంతో శంకర్‌ తనకు నచ్చిన సినిమాలను తెరకెక్కించే వీలు కలిగింది.

Published : 03 Jul 2021 17:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఇండియన్‌2’ వివాదంలో డైరెక్టర్‌ శంకర్‌కుఊరట లభించింది. ఆయనపై ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ వేసిన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు కొట్టివేసింది. దీంతో శంకర్‌ తనకు నచ్చిన సినిమాలను తెరకెక్కించే వీలు కలిగింది. అంతేకాదు.. నిర్మాణ సంస్థ కోరిన రూ.170.23కోట్ల అభ్యర్థనను కూడా కోర్టు తిరస్కరించింది. కమల్‌హాసన్‌ ప్రధాన పాత్రలో ‘ఇండియన్‌2’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కాజల్‌ అగర్వాల్‌ కీలక పాత్రలో నటిస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం పలు కారణాల వల్ల చిత్రీకరణ దశలోనే ఆగిపోయింది. ఈ క్రమంలోనే సినిమా చిత్రీకరణను పూర్తి చేశాకే శంకర్‌ తన కొత్త సినిమాను మొదలుపెట్టాలని నిర్మాణ సంస్థ కోర్టుని ఆశ్రయించింది.

ఇంతకీ ఏం జరిగిందంటే.. గతంలో కమల్‌హాసన్‌, శంకర్‌ కలయికలో ‘ఇండియన్’ ‌(భారతీయుడు) వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమాకు కొనసాగింపుగా ‘ఇండియన్‌2’ను ప్లాన్‌ చేశారు. చిత్రీకరణ కూడా మొదలుపెట్టారు. తొలుత చిత్ర నిర్మాణ వ్యయం రూ.270కోట్లుగా అంచనా వేశారు. నిర్మాణ సంస్థ విముఖత వ్యక్తం చేయడంతో చర్చలు జరిపి రూ.250కోట్లకు తగ్గించారు. అయినా సఖ్యత కుదరకపోవడంతో రూ.236కోట్లుగా బడ్జెట్‌ను నిర్ణయించారు. డైరెక్టర్‌ శంకర్‌ రెమ్యునరేషన్‌ రూ.36కోట్లు. కాగా.. చిత్రీకరణ దశలో ప్రమాదం చోటు చేసుకోవడంతో షూటింగ్‌ ఆగిపోయింది. ఆ తర్వాత పలు కారణాల వల్ల షూటింగ్‌ పునఃప్రారంభం కాలేదు. ఇదిలా ఉండగానే.. రామ్‌చరణ్‌ కథానాయకుడిగా ఓ పాన్‌ ఇండియా చిత్రంతో పాటు ‘అపరిచితుడు’ హిందీ రీమేక్‌ని రణ్‌వీర్‌సింగ్‌తో తెరకెక్కించనున్నట్లు శంకర్‌ ప్రకటించారు. ఈ క్రమంలోనే నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ కోర్టును ఆశ్రయించింది. ‘ఇండియన్2’ పూర్తయ్యే వరకూ శంకర్‌ వేరే సినిమాను తెరకెక్కించకుండా చూడాలని కోర్టును అభ్యర్థించింది. మే నెలలో అభ్యర్థనను పరిశీలించిన న్యాయస్థానం తీర్పును జూన్‌కు వాయిదా వేసింది. సామరస్యంగా చర్చించుకుని సమస్యను పరిష్కరించుకోవాలని కోర్టు సూచించింది. తాజాగా మరోసారి వాదోపవాదాలు పరిశీలించిన మద్రాసు హైకోర్టు డైరెక్టర్‌ శంకర్‌కు అనుకూలంగా తీర్పు వెలువరించింది.

శంకర్‌ తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. 2019లో చేసుకున్న ఒప్పందం ప్రకారం నిర్మాణ సంస్థ షరతులు పాటించలేదని, అలాంటప్పుడు అనుకున్న సమయానికి డైరెక్టర్‌ సినిమాను ఎలా పూర్తి చేస్తారని సందేహం వెలిబుచ్చారు. పైగా.. ఈ విషయంలో నెలకొన్న సమస్యను పరిష్కరించేందుకు నిర్మాణ సంస్థ ఒక్కసారి కూడా ప్రయత్నించకుండా డైరెక్టర్‌ను సంప్రదించకుండానే నేరుగా కోర్టును ఆశ్రయించారని పేర్కొన్నారు. కాగా.. తాజాగా వెలువడిన ఈ తీర్పుతో రామ్‌చరణ్‌-శంకర్‌ కాంబినేషన్‌లో పాన్‌ ఇండియా చిత్రం వీలైనంత త్వరగా పట్టాలెక్కేందుకు మార్గం సుగమం అయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని