RRR: అప్పుడు తాత-తండ్రి.. ఇప్పుడు మనవడు-కొడుకు..!

నందమూరి, మెగా కాంబోలో వచ్చిన చిత్రాలేంటో తెలుసా..?

Updated : 23 Mar 2022 11:14 IST

ఆసక్తికరమైన కాంబినేషన్‌ గురించి తెలుసా..

ఇంటర్నెట్‌ డెస్క్‌: అగ్ర కథానాయకులు జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కలిసి నటిస్తారా? అనే సినీ అభిమానుల సందేహానికి ‘రౌద్రం రణం రుధిరం’ (RRR) సినిమాతో దర్శకుడు రాజమౌళి సమాధానమిచ్చారు. సమాన స్థాయి అభిమానగణం ఉన్న హీరోలను ఒకే ‘తెర’పైకి తీసుకొచ్చారు. వీరిని ఒకే ఫ్రేమ్‌లో చూడాలని సగటు ప్రేక్షకుడితోపాటు సినీ ప్రముఖులూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీరిద్దరే కాదు.. గతంలో సీనియర్‌ ఎన్టీఆర్‌- చిరంజీవి కాంబోలో ఓ చిత్రం తెరకెక్కింది. ఆ వివరాలివీ.. 

ఆయన రాజా.. ఈయన కిశోర్‌

సీనియర్‌ ఎన్టీఆర్, చిరంజీవి కలిసి నటించిన సినిమా ‘తిరుగులేని మనిషి’. న్యాయవాది రాజాగా ఎన్టీఆర్‌, క్లబ్‌ల్లో పాటలు పాడే కిశోర్‌గా చిరంజీవి నటించారు. రతి అగ్నిహోత్రి, జయలక్ష్మి, సత్యనారాయణ, జగ్గయ్య, అల్లు రామలింగయ్య, ముక్కామల, చిడతల అప్పారావు తదితరులు కీలక పాత్రలు పోషించారు. కథేంటంటే.. రాజా తిరుగులేని న్యాయవాది. ప్రాక్టీస్‌ ప్రారంభంలోనే శభాష్‌ అనిపించుకుంటాడు. తన సోదరి పద్మ (జయలక్ష్మి) కిశోర్‌ను ప్రాణంగా ప్రేమిస్తుంది. ఈ వ్యవహారం రాజా తండ్రి శశిభూషణ రావు (జగ్గయ్య)కు నచ్చదు. కిశోర్‌కు ఆస్తిపాస్తులు లేని కారణంగా వారి పెళ్లిని తిరస్కరిస్తాడు. దాంతో.. పద్మ ఆత్మహత్యా ప్రయత్నం చేసుకుంటుంది. సకాలంలో ఆమెను రక్షించి, తండ్రికి తెలియకుండా కిశోర్‌తో వివాహం చేస్తాడు రాజా.

ఒకానొక సమయంలో.. తన తండ్రికి వజ్రాల అక్రమ రవాణా చేసే వారితో సంబంధముందని తెలుసుకున్న రాజా దిగ్భ్రాంతికి గురవుతాడు. తండ్రి మరణానికి కారకులెవరో తెలుసుకునే ప్రయత్నంలో తన బావమరిది కిశోర్‌కూ ఈ ముఠాతో సంబంధం ఉందని తెలుసుకుని షాక్‌ అవుతాడు. చిరంజీవి నెగెటివ్‌ రోల్‌ పోషించారనే ఈ ట్విస్ట్‌ సినిమాకే కీలకం. ఆ తర్వాత రాజా మాటలతో కిశోర్‌ మనసు మార్చుకుంటాడు. ఇద్దరు కలిసి స్మగ్లర్ల గుట్టు రట్టు చేస్తారు. ఈ  చిత్రానికి దర్శకత్వం వహించింది ఎవరో కాదు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. దేవీ వరప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమాకు కేవీ మహదేవన్‌ సంగీతం అందించారు. ఈ చిత్రం 1981 ఏప్రిల్‌ 1న విడుదలైంది. 

వారిది బంధుత్వం.. వీరిది స్నేహం:

సీనియర్‌ ఎన్టీఆర్‌, చిరంజీవి బావాబావమరిదిగా కనిపించగా.. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో స్నేహితులుగా కనిపించనున్నారు. నిప్పు (అల్లూరి సీతారామరాజు- చరణ్‌),  నీరు (కొమురం భీమ్‌- తారక్‌) దోస్తీ ఎలా ఉంటుందో చూపించబోతున్నారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ పాన్‌ ఇండియా చిత్రం మార్చి 25న ప్రేక్షకుల ముందుకురానుంది.

ఆ కాంబోలో కుదరలేదు.. కానీ: 

బాలకృష్ణ, చిరంజీవి కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కించాలని పలువురు దర్శకులు ప్రయత్నించినా సాధ్యపడలేదు. తెరపైనా ఈ ఇద్దరు కనిపించకపోయినా తెరవెనక ఎంతో స్నేహంగా ఉంటారు. బాలకృష్ణ నటించిన ఓ సినిమాను  చిరంజీవి ప్రమోట్ చేశారు. ఆ సినిమా ఏదో కాదు ‘ఆదిత్య 369’. 1991 జులై 18న ఈ సినిమాను ఎక్కువ మంది ప్రేక్షకులకు దగ్గర చేసేందుకు నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ ఓ ప్రముఖ టీవీ ఛానల్‌లో యాడ్స్ వేయాలని ప్లాన్ చేశారట. ఈ క్రమంలో చిరుతో ప్రచారం చేయిస్తే ఇంకా బాగుంటుందని భావించి.. ఆయన్ను సంప్రదించారట. అడిగిన వెంటనే చిరంజీవి ఓకే చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని