VirataParvam: నక్సలిజం, రాజకీయం, ప్రేమ.. విరాటపర్వం గురించి ఈ విశేషాలు తెలుసా?

స్టార్‌ హీరో, పెద్ద నిర్మాణ సంస్థ నుంచి వాస్తవ సంఘటనల ఆధారంగా ఓ చిత్రం వస్తుందంటే సాధారణంగానే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంటుంది. ఓ దర్శకుడు రెండో సినిమాకే సాహసం చేస్తున్నాడని తెలిస్తే అంచనాల స్థాయి పెరుగుతుంది. అంతటి ఆసక్తి, అంచనాలు పెంచిన సినిమానే ‘విరాటపర్వం’.

Updated : 16 Jun 2022 13:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్టార్‌ హీరో, పెద్ద నిర్మాణ సంస్థ నుంచి వాస్తవ సంఘటనల ఆధారంగా ఓ చిత్రం వస్తుందంటే సాధారణంగానే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంటుంది. ఓ దర్శకుడు రెండో సినిమాకే సాహసం చేస్తున్నాడని తెలిస్తే అంచనాల స్థాయి పెరుగుతుంది. అంతటి ఆసక్తి, అంచనాలు పెంచిన సినిమానే ‘విరాటపర్వం’ (VirataParvam). రానా (Rana Daggubati), సాయిపల్లవి (Sai Pallavi) ప్రధాన పాత్రల్లో వేణు ఊడుగుల (Venu Udugula) తెరకెక్కించారు. ఎస్‌. ఎల్‌. వి. సినిమాస్‌తో కలిసి ప్రముఖ నిర్మాణ సంస్థ సురేశ్‌ ప్రొడక్షన్స్‌ నిర్మించింది. జూన్‌ 17న విడుదలకానున్న నేపథ్యంలో ఈ సినిమా గురించి కొన్ని విశేషాలు చూద్దాం..

  1.  దర్శకుడు వేణు ఊడుగుల స్వస్థలం వరంగల్‌. ఆయనకు సాహిత్యమంటే మక్కువ. పుస్తకాలు బాగా చదువుతుంటారు. నక్సల్స్‌ జీవితాలను దగ్గరగా చూశారు. సామాజిక అంశాలు, చరిత్రలో దాగిన ఎన్నో కథలను తెరపైకి తీసుకురావాలనేది ఆయన సంకల్పం. ఈ క్రమంలోనే తొలి ప్రయత్నంగా ‘నీదీ నాదీ ఒకే కథ’ అనే సినిమా తీశారు. శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ హత్తుకుంది. టైటిల్‌కు తగ్గట్టు అందరితోనూ ఇది నా కథే అనిపించింది. చదువు ఒక్కటే జీవితం కాదనేది ఈ సినిమా ఇతివృత్తం. అంతగా ఆకట్టుకున్న దర్శకుడు తదుపరి ఎలాంటి సినిమా తీస్తాడని అంతా ఎదురుచూశారు. ఆయన చేసిన ద్వితీయ ప్రయత్నమే ఈ ‘విరాటపర్వం’.
  2.  తాను పుట్టిన గడ్డపై 1992లో జరిగిన ఓ హత్య వేణును కదిలించింది. ఆ మరణం వెనక రాజకీయం ఉందని తెలుసుకున్న ఆయన ఆ వాస్తవాన్ని తెరపైకి తీసుకురావాలని సంకల్పించారు. ఈ క్రమంలోనే పక్కాగా స్క్రిప్టు రాసుకుని ఆ మర్డర్‌ మిస్టరీకి ఓ చక్కని ప్రేమకథను జోడించారు.
  3.  ఆ మరణం ఎవరిదనే విషయాన్ని బయటపెట్టని ఆయన ప్రేమకథ గురించి పలు సందర్భాల్లో వివరించారు. ఇదొక అద్భుతమైన లవ్‌స్టోరీ అని పేర్కొన్నారు. రానా, సాయిపల్లవి మధ్య ఈ లవ్‌ ట్రాక్‌ నడుస్తుంది. నిజామాబాద్‌కు చెందిన శంకరన్న అనే వ్యక్తి స్ఫూర్తితో రానా పాత్ర, వరంగల్‌కు చెందిన సరళ అనే మహిళ స్ఫూర్తితో సాయిపల్లవి క్యారెక్టర్‌ రూపొందించారు.
  4.  ఈ చిత్రంలో కామ్రేడ్‌ రవన్నగా రానా, వెన్నెలగా సాయి పల్లవి, కామ్రేడ్‌ భారతక్కగా ప్రియమణి నటించారు. వెన్నెల అనే పాత్రలో ఒదిగిపోయేందుకు చిత్రీకరణ ప్రారంభంలో సాయిపల్లవి ఓ రోజంతా ఆహారం తీసుకోలేదట. ఈ చిత్రంలో ప్రముఖ నటులు నందితాదాస్‌, జరీనా వాహబ్‌, ఈశ్వరీ రావు, నవీన్‌ చంద్ర, సాయి చంద్‌ కీలక పాత్రలు పోషించారు.
  5.  విరాటపర్వాన్ని ఓ విధంగా లేడీ ఓరియెంటెడ్‌ సినిమాగా పరిగణించవచ్చు. ఎందుకంటే సాయిపల్లవి పాత్ర ప్రధానంగా ఈ సినిమా సాగుతుంది. వెన్నెల క్యారెక్టర్‌కు అంత స్కోప్‌ ఉంది. ఈ సినిమాలో 8 ప్రధాన పాత్రలు ఉండగా అందులో 5 స్త్రీ పాత్రలే. అందుకే ఈ చిత్రంలో కీలక పాత్ర (కామ్రేడ్‌ రవన్న) పోషించేందుకు ఏ హీరో అయినా ఒప్పుకుంటారా అని దర్శకుడు ప్రారంభంలో సందేహించారట. ఇలా తర్జన భర్జనలోనే సినిమాను నిర్మిస్తారేమోనని నటుడు రానాను కలిశారు వేణు. స్క్రిప్టు తనను కూర్చోనివ్వకుండా చేయడంతో రానా వెంటనే ఈ సినిమాలో నటిస్తానని చెప్పారట. అలా రానా ఎంట్రీ ఇవ్వడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.
  6.  దర్శకుడు వేణు ఈ సినిమాకి ముందెన్నడూ సాయిపల్లవిని కలవలేదు. ‘విరాటపర్వం’ కథ వినిపించేందుకు తొలిసారి ఆమెను కలిశారు. స్టోరీ విన్న వెంటనే ఆమె ఈ చిత్రంలో నటించేందుకు అంగీకరించారు. తెలుగు తెరపై నక్సలిజం నేపథ్యంలో పలు సినిమాలు వచ్చినా, వాటిల్లో అంతగా ప్రేమకథ కనిపించదు. మావోయిస్టులు, రాజకీయ నాయకుల గురించి చెప్పడంతోపాటు ఓ అందమైన లవ్‌స్టోరీని ఆవిష్కరించడంతో ఈ సినిమా ప్రత్యేకతను సంతరించకుంది.
  7.  ఈ సినిమాకి ఇక్కడి ప్రముఖ సాంకేతిక నిపుణులే కాకుండా విదేశాల వారూ పనిచేశారు. దివాకర్‌మణితో కలిసి స్పెయిన్‌కు చెందిన డానీ సాంచెజ్‌ లోపెజ్‌ ఈ చిత్ర ఛాయాగ్రహణ బాధ్యతలు తీసుకున్నారు. పీటర్‌ హెయిన్‌తో కలిసి జర్మనీకి చెందిన స్టీఫెన్‌ స్టంట్‌ కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. ఈ చిత్రానికి సంగీతం: సురేశ్‌ బొబ్బిలి, కూర్పు: శ్రీకర్‌ ప్రసాద్‌, నృత్యం: రాజు సుందరం, ప్రేమ్‌ రక్షిత్‌, ప్రొడక్షన్ డిజైనర్‌: శ్రీనాగేంద్ర. 
  8.  మహాభారతంలోని విరాటపర్వం గురించి అందరికీ తెలిసిందే. అందులో ఉన్నట్టే ఈ సినిమాలోనూ కుట్రలు, రాజకీయాలు, ఫిలాసఫీ తదితర అంశాలు కనిపిస్తాయి. అందుకే ఈ సినిమాకి ‘విరాటపర్వం’ అనే టైటిల్‌ పెట్టారు.
  9.  2019 జూన్‌ 15న ‘విరాటపర్వం’ చిత్రీకరణ ప్రారంభమైంది. ముందుగా ఈ చిత్రాన్ని 2021 ఏప్రిల్‌ 30న విడుదల చేయాలని దర్శకనిర్మాతలు భావించినా కొవిడ్‌, ఇతరత్రా కారణాల వల్ల పలుమార్లు వాయిదా పడింది. ఈ గ్యాప్‌లో పలు ఓటీటీ సంస్థల నుంచి ఆఫర్లు వచ్చినా చిత్ర బృందం ఈ సినిమాను పెద్ద తెరపైకే తీసుకురావాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు 2022 జులై 1 విడుదలచేస్తున్నట్టు ఇటీవల ప్రకటించినా తర్వాత తేదీని మార్చింది. విరాటపర్వాన్ని ముందుగానే మీ ముందుకు తీసుకొస్తున్నామంటూ జూన్‌ 17ను ఖరారు చేసింది.
  10.  ఈ సినిమా ప్రస్తుతానికి తెలుగు భాషలోనే అందుబాటులో ఉండనుంది. 90ల నాటి పరిస్థితులు కళ్లకు కట్టినట్టు చూపించేందుకు ఈ సినిమా కోసం ‘వైడ్‌స్క్రీన్‌ ఫార్మాట్‌’ను ఉపయోగించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని