‘మోహన’ గానానికి క్రేజ్‌ పెరిగిన వేళ

‘టక్‌ జగదీశ్‌’.. నాని కథానాయకుడిగా తెరకెక్కుతోన్న ఈ సినిమా టీజర్‌ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. దానికి ఓ కారణం గాయని మోహనా భోగరాజు. ఆ టీజర్‌ ప్రారంభం నుంచి....

Updated : 18 Apr 2021 16:01 IST

‘మనోహరి’ టు ‘మగువా మగువా’ గాయని ప్రయాణమిది

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘టక్‌ జగదీశ్‌’.. నాని కథానాయకుడిగా తెరకెక్కుతోన్న ఈ సినిమా టీజర్‌ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. దానికి ఓ కారణం గాయని మోహనా భోగరాజు. ఆ టీజర్‌ ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకూ వినిపించే ఆమె గానం ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తోంది. వరుస హిట్‌ సాంగ్స్‌తో టాలీవుడ్‌ స్టార్‌ సింగర్‌గా రాణిస్తున్న మోహన.. అంత సులభంగా ఫామ్‌లోకి రాలేదు. చిన్నప్పుడు ఎన్నో మ్యూజిక్‌ ప్రోగ్రామ్స్‌కు వెళ్లి.. సెలక్షన్స్ దశ‌లోనే వెనుదిరిగిన ఈ గాయని గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు

అమ్మకు ఎంతో ఇష్టం..

మోహనా భోగరాజు వాళ్లమ్మకు సంగీతమంటే ఎంతో ఆసక్తి. దాంతో చిన్నప్పటి నుంచే మోహన పాటలు పాడడం నేర్చుకున్నారు. అలా ఆమె మూడేళ్ల వయసులోనే గొంతు సవరించుకున్నారు. శాస్త్రీయ సంగీతంలో శిక్షణ తీసుకున్నారు. ప్రస్తుతం తాను ఈ స్థాయిలో ఉండడానికి ముఖ్యంగా తన కుటుంబం, భర్త సపోర్టే కారణమని ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.


ఎన్నోసార్లు వెనుదిరిగి‌..

పాటపై ఉన్న మక్కువతో చిన్నప్పటి నుంచే ఎక్కడ సంగీతం పోటీలు జరిగినా మోహన అక్కడ వాలిపోయేవారు. బుల్లితెరలో ప్రసారమయ్యే పలు పాటల పోటీల్లో పాల్గొన్నప్పటికీ చాలాసార్లు ఆమె సెలక్షన్స్‌లోనే విఫలమై ఇంటి బాట పట్టారట. అలా ఎన్నో సందర్భాల్లో విఫలమైనప్పటికీ భవిష్యత్తుపై నమ్మకం ఉంచి.. ఆమె ముందడుగు వేశారు.


ఉదయ్‌కిరణ్‌ సినిమాలో..

సంగీతం నేర్చుకుంటున్న సమయంలో ఓసారి మ్యూజిక్‌ డైరెక్టర్‌ బాలాజీ.. మోహన వాయిస్‌ విన్నారు. ఆయన సంగీత దర్శకుడిగా వ్యవహరించిన ‘జైశ్రీరామ్‌’లో ‘సయ్యామమాసం’ అనే పాటను ఆమెతో పాడించారు. దీని తర్వాత ఆమె పలు చిత్రాలకు కోరస్‌ కూడా పాడారు.


ఏడాది గ్యాప్‌ తర్వాత ఎంట్రీ

‘జైశ్రీరామ్‌’లో పాట పాడినప్పటికీ ఎలాంటి గుర్తింపు రాకపోవడంతో మోహన కొన్ని నెలలపాటు ఓ ఉద్యోగం చేశారు. అలా ఏడాదిన్నర తర్వాత మళ్లీ సింగర్‌గా మారాలని.. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణిని కలవాలని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో గాయని రమ్య బెహరా సాయంతో మొదటిసారి కీరవాణిని కలిసి తాను రికార్డ్‌ చేసిన పాటల క్యాసెట్‌ని ఆయనకి అందించారు.


మనోహరితో ఫేమ్‌

మోహన వాయిస్‌ విన్న కీరవాణి ఆమెకు ఫోన్‌ చేసి ‘బాహుబలి’ చిత్రంలో పాట పాడే అవకాశాన్ని ఇచ్చారు. ఆమె పాడిన పాటే.. ‘మనోహరి’. ఆ పాటతో మోహన భోగరాజుకు యువతలో క్రేజ్‌ వచ్చేసింది. అలాగే ఆమెకు ఆఫర్స్‌ కూడా వరుస కట్టాయి. ‘భలే భలే మగాడివోయ్‌’ టైటిల్‌ సాంగ్‌, ‘బాహుబలి-2’లోని ‘ఓరోరి రాజా’(తమిళ వెర్షన్‌) పాటలు మోహనే పాడారు. సినిమాల్లో పాటలే కాకుండా ప్రత్యేక ఆల్బమ్స్‌ కూడా ఆమె చేస్తుంటారు. ఇటీవల ఆమె విడుదల చేసిన ‘బుల్లెట్‌ బండి’ ఆల్బమ్‌ విశేషమైన ఆదరణ సొంతం చేసుకుంది.


మరికొన్ని విశేషాలు

1. మోహన భోగరాజు పుట్టింది, పెరిగింది అంతా హైదరాబాద్‌లోనే.

2. బీటెక్‌ చదివినప్పటికీ ఎంబీఏ చేయాలనే ఆశ ఆమెలో ఎక్కువగా ఉండేది. అలా.. సింగర్‌గా ఇండస్ట్రీలోకి వచ్చాక ఆమె ఎంబీఏ పూర్తి చేశారు.

3. మోహనకు టెక్నాలజీపై ఆసక్తి చాలా తక్కువ. అందుకే ఆమె సోషల్‌మీడియాకు కొంత దూరంగా ఉంటారు.

4. కెరీర్‌లో ఫామ్‌లోకి వచ్చాక మోహన ఫేస్‌బుక్‌లోకి అడుగుపెట్టారు.

5. ‘అరవింద సమేత’లో రెడ్డమ్మ తల్లి పాట పాడి అందరి ప్రశంసలు అందుకున్నారు ఈ గాయని.

6. ఇటీవల విడుదలైన ‘మగువా మగువా’ ఫిమేల్‌ వెర్షన్‌ పాడింది ఈ భామనే.

7. ‘సైజ్‌ జీరో’, ‘అఖిల్‌’, ‘సోగ్గాడే చిన్నినాయనా’, ‘ఇజం’, ‘శతమానం భవతి’, ‘జవాన్‌’, ‘భాగమతి’, ‘సవ్యసాచి’, ‘బ్లఫ్‌ మాస్టర్‌’, ‘ఎన్టీఆర్‌ బయోపిక్‌’, ‘ఓ బేబీ’, ‘వెంకీమామ’, ‘హిట్’ వంటి చిత్రాల్లో మోహన పాటలు పాడారు.






Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని