Avatar2: ‘అవతార్‌2’ కోసం కొన్ని సంవత్సరాలు ఆలోచించా..: జేమ్స్‌ కామెరూన్‌

అవతార్‌2(Avatar2: The Way Of Water) సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా కోసం జేమ్స్‌ కామెరూన్‌(James Cameron) ఎంత కష్టపడ్డారో తెలిపారు. 

Published : 17 Dec 2022 01:49 IST

హైదరాబాద్‌: ప్రస్తుతం అవతార్‌2(Avatar2: The Way Of Water) సినిమా టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి సినీ ప్రియులు జై కొట్టారు. వయసుతో సంబంధం లేకుండా అందరినీ మరో లోకంలోకి తీసుకెళ్లాడు ఈ చిత్ర దర్శకుడు జేమ్స్‌ కామెరూన్(James Cameron)‌. సినిమా విజయంపై స్పందిస్తూ ఓ ప్రముఖ వార్త సంస్థతో ఆయన మాట్లాడారు.

‘2009లో విడుదలైన అవతార్‌ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లను సాధించింది. ఆ సినిమా తర్వాత అందరూ దానికి సీక్వెల్‌ వస్తే బాగుంటుందని భావించారు. ఇలా సీక్వెల్స్‌ తెరకెక్కించాలని ఒక్కసారిగా అనుకున్నది కాదు. కొన్ని సంవత్సరాలు ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. చాలా ఆత్మపరిశీలన చేసుకొని.. నన్ను నేను ప్రశ్నించుకున్న తర్వాత మొదలుపెట్టా.. ఇప్పుడు అవతార్ సీక్వెల్స్‌ అన్ని వివిధ దశల్లో ఉన్నాయి. 1982లో స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌(Steven Spielberg) దర్శకత్వంలో ఎక్స్‌ట్రా టెర్రెస్ట్రియల్(Extra-Terrestrial) సినిమా తీశారు. అది మంచి విజయాన్ని అందుకుంది. కానీ ఆయన దానికి సీక్వెల్‌ తీయలేదు. నేను అలా ఆగిపోదాం అని అనుకోవడం లేదు’ అని ఆయన స్పష్టం చేశారు.

‘ఈరోజు విడుదలైన అవతార్‌ సినిమా అద్భుతమైన కమర్షియల్‌ హిట్‌ను అందుకుంది.  ‘టైటానిక్’(Titanic) తర్వాత బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు చేసిన చిత్రంగా నిలిచింది. ప్రకృతితో మానవులకు ఉన్న సంబంధం చాలా గొప్పది. దానినే నేను అవతార్‌లో చూపించాను. ఈ సినిమా తీయడానికి కొన్ని సంవత్సరాల సమయం పట్టింది. ప్రేక్షకులు ధియేటర్లో సినిమా చూసేటప్పుడు మా కష్టమంతా వాళ్లకి కనిపిస్తుంది. నేను ఈ చిత్రాన్ని రూపొందించడానికి ఎన్నో డాక్యుమెంటరీలు రూపొందించాను. ప్రతి విషయాన్ని ఎంతో నిశితంగా పరిశీలించి ఆడియన్స్‌కు అందించాం’ అని అవతార్‌ విజయంపై జేమ్స్‌ కామెరూన్‌ ఆనందం వ్యక్తం చేశారు.    

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని