Jeevitha: మేము ఎలాంటి తప్పు చేయలేదు.. ఆవిషయంలో బాధగా ఉంది: జీవిత

‘గరుడ వేగ’ సినిమాకు సంబంధించిన లావాదేవీల విషయంలో జీవిత, రాజశేఖర్‌ తమని మోసం చేశారంటూ జోస్టార్స్‌ ప్రొడెక్షన్స్‌కు చెందిన కోటేశ్వరరాజు, హేమ శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కోటేశ్వరరాజు చేసిన వ్యాఖ్యలపై ...

Updated : 23 Apr 2022 14:34 IST

‘గరుడవేగ’ చెక్‌బౌన్స్‌ కేసుపై స్పందించిన నటి

హైదరాబాద్‌: ‘గరుడ వేగ’ సినిమాకు సంబంధించిన లావాదేవీల విషయంలో జీవిత, రాజశేఖర్‌ తమని మోసం చేశారంటూ జోస్టార్స్‌ ప్రొడెక్షన్స్‌కు చెందిన కోటేశ్వరరాజు, హేమ శుక్రవారం ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై తాజాగా జీవిత స్పందించారు. ‘శేఖర్‌’ మూవీ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న ఆమె ఈ కేసు గురించి మాట్లాడారు. సుమారు రెండు నెలల నుంచి ఈ కేసు కోర్టులో ఉందని, ఇప్పుడు వాళ్లు ప్రెస్‌మీట్‌ పెట్టి ఇలాంటి ఆరోపణలు ఎందుకు చేశారో తెలియదని అన్నారు. కోటేశ్వరరాజు చేస్తోన్న ఆరోపణల్లో ఎంతమాత్రం వాస్తవాలు లేవని.. తాము ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు.

‘‘జోస్టార్స్‌ ప్రొడెక్షన్‌కు సంబంధించి కోర్టులో రెండు నెలల నుంచి కేసు నడుస్తోంది. వాళ్లు ఇప్పుడెందుకు మీడియా ముందుకు వచ్చారో నాకు తెలియదు. ఈ కేసుకు సంబంధించి 2 నెలల క్రితమే వారెంట్‌ వచ్చింది. నాకెలాంటి సమన్లు అందలేదు. మా గౌరవానికి భంగం కలిగించడం ఎవరి తరం కాదు. నేను తప్పు చేస్తే ఒప్పుకుంటా, నా తప్పు లేకపోతే దేవుడ్ని కూడా ధైర్యంగా నిలదీస్తా. మా గురించి ఆరోపణలు చేసిన వాళ్లేమీ మహాత్ములు కాదు. వాళ్ల వల్ల మా మేనేజర్‌, ఇంకా ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోర్టులో కేసు నడుస్తోంది.. నేను దాని గురించి ఎక్కువగా మాట్లాడలేను. ఈ విషయంలో నేను దేన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా. ఇక ఈ విషయాన్ని పక్కనపెడితే.. యూట్యూబ్‌లో కొంతమంది క్రియేట్‌ చేస్తోన్న థంబ్‌నేల్స్‌ చూస్తుంటే బాధగా అనిపిస్తోంది. కోటేశ్వరరాజు, హేమల ప్రెస్‌మీట్‌ని ఆధారంగా చేసుకుని కొంతమంది నిన్న ఏవేవో వీడియోలు క్రియేట్‌ చేసి ఇష్టం వచ్చినట్లు పెట్టారు. వాటిని చూసి నేను కాస్త ఇబ్బందిపడ్డా. మొన్న నా కూతుళ్ల గురించి, ఇటీవల నిహారికపై కూడా ఇలాగే యూట్యూబ్‌లో పెట్టారు. దయచేసి ఇలా ఇష్టం వచ్చినట్లు థంబ్‌నేల్స్‌ పెట్టి మాకు ఇబ్బంది కలిగించకండి’’ అని జీవిత పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని