Rajamouli: సినిమా కోసం ఫ్రిజ్‌లో ‘ఈగ’లు.. రాజమౌళి ఎందుకలా చేశారంటే?

తాను అనుకున్న ఔట్‌పుట్‌ వచ్చేంతవరకూ దర్శకుడు రాజమౌళి ప్రతి సన్నివేశాన్నీ చెక్కుతూనే ఉంటారు .

Published : 29 Mar 2022 02:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తాను అనుకున్న ఔట్‌పుట్‌ వచ్చేంతవరకూ దర్శకుడు రాజమౌళి ప్రతి సన్నివేశాన్నీ చెక్కుతూనే ఉంటారు. అందుకే ఆయన్ను ‘జక్కన్న’ అని సినీ ప్రియులు ముద్దుగా పిలుస్తుంటారు. ‘ప్రతి సౌకర్యం వెనక ఓ మినీ యుద్ధం’ ఉన్నట్టే  ప్రతి కథ వెనకా రాజమౌళి రీసెర్చ్‌ తప్పక ఉంటుంది. అందుకే ఆయన స్టార్‌ హీరోలతోనే కాకుండా ‘ఈగ’తోనూ రికార్డు సృష్టించారు. దర్శకదిగ్గజాలెందరినో ఆశ్చర్యానికి గురిచేశారు. ‘ఈగ’ చిత్రం కోసం రాజమౌళి ఏం చేశారో నటులు జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ తెలిపారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా ప్రచారంలో భాగంగా ఆసక్తికర విషయాన్ని వారు ఇటీవల పంచుకున్నారు.

‘ఈగ’ సినిమాకు పనిచేసిన సమయంలో రాజమౌళి కొన్ని ఈగలను ఫ్రిజ్‌లో ఉంచారని, ఆ ఫ్రిజ్‌లో ఆహారంకంటే ఈగలే ఎక్కువగా ఉండేవని జూనియర్‌ ఎన్టీఆర్‌ చెప్పారు. రాజమౌళి ఇలా చేయడానికి కారణమేంటో రామ్‌చరణ్‌ తెలిపారు. ఈగల సుప్తావస్థ (హైబర్‌నేషన్‌) గురించి తెలుసుకునేందుకే ఆయన అలా చేశారన్నారు. గడ్డకట్టే ఉష్ణోగ్రతలో వాటి మనుగడ ఎలా ఉంటుందో చెక్‌ చేసేవారని తెలిపారు. టీమ్‌తో కలిసి ఈగల గురించి ప్రతి అంశాన్ని సుదీర్ఘంగా చర్చించేవారన్నారు. ఈగల గురించి అంతలోతుగా తెలుసుకున్నారు కాబట్టే రాజమౌళి అంతటి అద్భుతమైన చిత్రాన్ని తీయగలిగారు. నాని, సమంత ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఘన విజయం అందుకుంది. సుదీప్‌ విలనిజం ఎంతగానో ఆకట్టుకుంది. 2012లో విడుదలైన ఈ సినిమా 2 జాతీయ అవార్డులు, 3 సైమా అవార్డులు, 5 సౌత్‌ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు సాధించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని