NTR: కోమాలో అభిమాని.. ఫోన్‌ చేసి మాట్లాడిన తారక్‌

రోడ్డు ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్లిన తన అభిమానికి ఫోన్‌ చేసి పరామర్శించారు నటుడు తారక్ (NTR)‌. ‘‘నువ్వు కోలుకుని రా. మనం త్వరలో కలుద్దాం’’ అని ధైర్యం చెప్పారు. నేనున్నానంటూ ....

Updated : 30 Jun 2022 14:10 IST

హైదరాబాద్‌: తన అభిమానులు ఇబ్బందుల్లో ఉన్నారని తెలిస్తే వారికి సాయం చేయడానికి ఎల్లప్పుడూ ముందుంటారు నటుడు తారక్‌. ఆ మధ్య రోడ్డు ప్రమాదానికి గురైన ఓ అభిమానితో వీడియో కాల్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు. తాజాగా అలాంటి ఘటనే మరోసారి జరిగింది. తన అభిమాని ఒకరు రోడ్డు ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్లాడని తెలుసుకుని.. తారక్‌ అతడి కుటుంబంతో ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు. ‘‘నువ్వు కోలుకుని రా. మనం త్వరలో కలుద్దాం’’ అంటూ అభిమానికి ధైర్యం చెప్పారు. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు ఇప్పుడు నెటిజన్ల మదిని హత్తుకుంటున్నాయి. అసలేం జరిగిందంటే..

జనార్దన్‌ అనే ఓ యువకుడికి తారక్‌ అంటే అమితమైన ఇష్టం. ఎంతలా అంటే.. తన చేతిపై ఎన్టీఆర్‌ అని పచ్చబొట్టు వేయించుకుని మరి అభిమానాన్ని చాటుకున్నాడు. అయితే ఇటీవల అతను రోడ్డు ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్లాడు. ఇతర అభిమానులు చెప్పడంతో ఈ విషయాన్ని తెలుసుకున్న తారక్‌.. వెంటనే జనార్దన్‌ కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడారు. ‘‘జనార్దన్‌కు ఏం కాదు. మీరు ధైర్యంగా ఉండండి. అందరం కలిసి దేవుడ్ని ప్రార్థిద్దాం. నేనున్నా’’ అంటూ భరోసానిచ్చారు. అనంతరం జనార్దన్‌ వద్దకు ఫోన్‌ తీసుకెళ్లమని చెప్పిన తారక్‌.. ‘‘జనార్దన్‌ నేను ఎన్టీఆర్‌ని మాట్లాడుతున్నా. నువ్వు త్వరగా కోలుకుని రా. మనం త్వరలోనే కలుద్దాం. నీకోసం ప్రార్థిస్తున్నా. నీకోసం నేనున్నా.. మన అభిమానులున్నారు’’ అని ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. తారక్‌ మాటలకు జనార్దన్‌ స్పందించారని కుటుంబ సభ్యులు తెలిపారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని