NTR: ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలకు రాలేకపోతున్నా: జూనియర్‌ ఎన్టీఆర్‌

 ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలకు హాజరుకాలేకపోతున్నట్లు జూనియర్‌ ఎన్టీఆర్‌ వెల్లడించారు. ముందస్తు కార్యక్రమాల వల్ల గైర్హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు.

Published : 20 May 2023 11:41 IST

హైదరాబాద్: తెలుగువారి అభిమాన నటుడు నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలకు హాజరుకాలేకపోతున్నట్లు ఆయన మనవడు, సినీ నటుడు జూ.ఎన్టీఆర్‌ వెల్లడించారు. ముందస్తు కార్యక్రమాల వల్ల గైర్హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ విషయాన్ని ఆహ్వానం ఇచ్చేటప్పుడే సావనీర్‌ కమిటీకి చెప్పినట్లు ఎన్టీఆర్‌ స్పష్టం చేశారు. 

హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీ-మూసాపేట ప్రాంతాల మధ్య ఉన్న కైత్లాపూర్‌ మైదానంలో ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలు జరగనున్నాయి. ఈరోజు సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు ఉత్సవాలు నిర్వహించనున్నారు. పది ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. 200 మంది కూర్చునేలా భారీ వేదికను సిద్ధం చేశారు. వేదిక ముందు, పక్కన ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు, సినీ రంగ ప్రముఖులు కూర్చొనేలా గ్యాలరీలను ఏర్పాటు చేశారు. పాస్‌లు ఉన్నవారికే ప్రవేశం కల్పిస్తున్నట్లు ఉత్సవ కమిటీ ఛైర్మన్‌ తెలిపారు. 

ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలకు ముఖ్యఅతిథిగా తెదేపా అధినేత చంద్రబాబు హాజరుకానున్నారు. వేడుకల్లో హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, సినీనటులు మురళీమోహన్‌, వెంకటేశ్‌, ప్రభాస్‌, కల్యాణ్‌ రామ్‌, అల్లు అర్జున్‌, రానా, సుమన్‌, జయప్రద, కె. రాఘవేంద్రరావు తదితరులు పాల్గొనన్నున్నారు. ఈ వేడుకల సందర్భంగా ఎన్టీఆర్‌ జీవిత చరిత్రపై ముద్రించిన ప్రత్యేక సంచిక, వెబ్‌సైట్‌లను ఆవిష్కరించనున్న సంగతి తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని