K Viswanath: కె.విశ్వనాథ్‌ సతీమణి కన్నుమూత

ప్రముఖ దర్శకుడు.. కళాతపస్వి కె.విశ్వనాథ్‌ (K Viswanath) ఇంట మరో విషాదం చోటు చేసుకుంది. ఆయన సతీమణి జయలక్ష్మి(86) హైదరాబాద్‌లోని స్వగృహంలో కన్నుమూశారు.

Updated : 27 Feb 2023 06:37 IST

ప్రముఖ దర్శకుడు.. కళాతపస్వి కె.విశ్వనాథ్‌ (K Viswanath) ఇంట మరో విషాదం చోటు చేసుకుంది. ఆయన సతీమణి జయలక్ష్మి(86) హైదరాబాద్‌లోని స్వగృహంలో కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. ఆదివారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు ఓ ప్రకటనలో తెలిపారు. విశ్వనాథ్‌ ఈ నెల 2నే కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన చనిపోయిన 24రోజులకే జయలక్ష్మి కూడా మృతి చెందడంతో అటు కుటుంబ సభ్యులు, ఇటు సినీప్రియులు శోకసంద్రంలో మునిగిపోయారు. సోమవారం పంజాగుట్ట శ్మశాన వాటికలో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి.

* కె.విశ్వనాథ్‌ 20ఏళ్ల వయసులో జయలక్ష్మిని వివాహం చేసుకున్నారు. వీరిది పెద్దలు కుదిర్చిన పెళ్లే. అప్పటికి విశ్వనాథ్‌ జీవితంలో స్థిరపడకపోయినా.. తల్లిదండ్రులు చెప్పడంతో వివాహానికి అంగీకరించారు. సినిమా విషయాల్ని ఆయన ఎప్పుడూ ఇంట్లో చర్చించేవారు కాదట. ‘నా భార్య నా సినిమాల్ని చూసి అలా ఉన్నాయి.. ఇలా ఉన్నాయని విశ్లేషించదు. బాగుంది అని మాత్రమే చెబుతుంది’ అంటూ ఓ సందర్భంలో కళాతపస్వి తన సతీమణి గురించి చెప్పారు. ఈ దంపతులకు ముగ్గురు సంతానం. పెద్దమ్మాయి పద్మావతి దేవి. అబ్బాయిలు కె.నాగేంద్రనాథ్‌, కె.రవీంద్రనాథ్‌. చిత్ర పరిశ్రమపై ఆసక్తి లేకపోవడంతో వారికిష్టమైన రంగాల్లో స్థిరపడ్డారు. జయలక్ష్మి మృతిపట్ల పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేసారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని