‘ఆస్కార్‌’ ప్రదర్శనపై కాలభైరవ ట్వీట్‌.. మండిపడుతోన్న నెటిజన్లకు సారీ చెప్పిన సింగర్‌

సినీ ప్రియులు, నెటిజన్లకు కీరవాణి కుమారుడు, గాయకుడు కాలభైరవ (Kaala Bhairava) క్షమాపణలు చెప్పారు. తన ఉద్దేశాన్ని అభిమానులు తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. 

Published : 17 Mar 2023 11:31 IST

హైదరాబాద్‌: నెటిజన్లు, సినీ ప్రియులకు క్షమాపణలు చెప్పారు గాయకుడు కాలభైరవ (Kaala Bhairava). ‘ఆస్కార్‌’ (Oscars 2023) ప్రదర్శనను ఉద్దేశిస్తూ తాను చేసిన ట్వీట్‌ను కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన అన్నారు. తన ట్వీట్‌ వల్ల ఎవరైనా ఇబ్బందిపడితే క్షమించమని కోరారు. ‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR), ‘నాటు నాటు’ (Naatu Naatu) ఇంతటి విజయాన్ని అందుకోవడానికి ఎన్టీఆర్‌ (NTR), రామ్‌ చరణే (Ram Charan) ప్రధాన కారణం.. ఈ విషయంలో నాకేలాంటి సందేహం లేదు. ‘ఆస్కార్‌’ స్టేజ్‌పై ప్రదర్శన ఇవ్వడానికి నాకెంతో తోడ్పడిన వారికి కృతజ్ఞతలు చెబుతూ మాత్రమే ఆ ట్వీట్‌ చేశాను. అంతకు మించి మరే ఉద్దేశం నాకు లేదు. నేను చేసిన ట్వీట్‌ బయటవారికి మరోలా అర్థమైందని భావిస్తున్నాను. అందుకు క్షమించండి’’ అని కాలభైరవ తాజాగా ట్వీట్‌ చేశారు.

అకాడమీ (ఆస్కార్‌) అవార్డుల ప్రదానోత్సవంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) టీమ్‌ సందడి చేసిన విషయం తెలిసిందే. గాయకులు కాలభైరవ, రాహుల్‌ సిప్లిగంజ్‌ ఆస్కార్‌ వేదికపై ‘నాటు నాటు’ ప్రదర్శన ఇచ్చారు. అయితే, తాను ఈ ప్రదర్శన ఇవ్వడానికి దోహదపడిన వారందరికీ ధన్యవాదాలు చెబుతూ కాలభైరవ శుక్రవారం తెల్లవారుజామున ఓ ట్వీట్‌ పెట్టారు. ‘‘అకాడమీ అవార్డుల స్టేజీపై లైవ్‌లో ‘నాటు నాటు’ ప్రదర్శన ఇచ్చినందుకు ఎంతో గర్విస్తున్నాను. రాజమౌళి బాబా, పెద్దమ్మ, అమ్మానాన్న, కార్తికేయ, ప్రేమ్‌ రక్షిత్‌.. ఇలా వీరందరూ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా నాకు ఈ విలువైన అవకాశం దక్కేలా సాయం చేశారు. వాళ్ల శ్రమ, పనితనం వల్లే ఈ పాట ప్రపంచం నలుమూలలకు చేరింది. అందరితో డ్యాన్స్‌ చేయించింది. దాని వల్లే ఈ అవకాశం నన్ను వరించింది. కాబట్టి వారి కారణంగానే నేను ఈ అందమైన అనుభూతిని పొందగలిగాను. ఈ వాస్తవాన్ని ఎప్పటికీ మర్చిపోను. వాళ్ల విజయంలో నేనూ భాగమైనందుకు ఆనందిస్తున్నా’’ అని కాలభైరవ రాసుకొచ్చారు. అయితే, ఈ ట్వీట్‌ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ పేర్లను ప్రస్తావించకుండా కాలభైరవ ట్వీట్‌ చేయడాన్ని తప్పుబట్టారు. ఈ నేపథ్యంలోనే వారందరికీ క్షమాపణలు చెబుతూ కాలభైరవ తాజాగా ట్వీట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని