కాజల్‌ లెహెంగా: 20మంది నెల రోజులు శ్రమించి..

అందాల భామ కాజల్‌ ఎట్టకేలకు ఓ ఇంటి కోడలయ్యారు. తన స్నేహితుడు, ప్రియుడు గౌతమ్‌ కిచ్లును శుక్రవారం మనువాడారు. ముంబయిలోని తాజ్‌ హోటల్‌లో అతి తక్కువ మంది సన్నిహితుల సమక్షంలో వివాహ వేడుక ఘనంగా జరిగింది. ముహూర్తం వేళ ‘చందమామ’ గులాబి రంగు లెహెంగాలో పెళ్లి కుమార్తెగా....

Updated : 08 Dec 2022 14:22 IST

హైదరాబాద్‌: అందాల భామ కాజల్‌ ఎట్టకేలకు ఓ ఇంటి కోడలయ్యారు. తన స్నేహితుడు, ప్రియుడు గౌతమ్‌ కిచ్లును శుక్రవారం మనువాడారు. ముంబయిలోని తాజ్‌ హోటల్‌లో అతి తక్కువ మంది సన్నిహితుల సమక్షంలో వివాహ వేడుక ఘనంగా జరిగింది. ముహూర్తం వేళ ‘చందమామ’ గులాబి రంగు లెహెంగాలో పెళ్లి కుమార్తెగా వెలిగిపోయారు. ఈ పెళ్లితంతు ఫొటోలు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాయి. కాజల్‌ ధరించిన లెహెంగాను ప్రముఖ డిజైనర్‌ అనామికా ఖన్నా రూపొందించారు. ఎంతో ప్రేమగా ఈ లెహెంగాను తయారు చేశామంటూ అనామిక సోషల్‌ మీడియాలో పేర్కొన్నారు. ఫ్లోరల్‌ డిజైన్‌లో జర్దోసీ వర్క్‌ వేయడానికి 20 మంది దాదాపు నెలరోజులపాటు పనిచేశారని తెలిపారు. మిహీకా బజాజ్‌, సోనమ్‌ కపూర్‌, మీరా కపూర్‌ తదితరులు తమ పెళ్లి రోజున అనామిక డిజైన్‌ చేసిన లెహెంగా ధరించారు.

తాళికట్టే వేళ సునీతా షెకావత్ చేతితో తయారు చేసిన ఆభరణాలను ధరించారు. ఇందులో ఆకుపచ్చ రాళ్లను పొదిగారు. ఆమె తలకు పెట్టుకున్న మాతాపట్టి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఏదైతేనే.. కాజల్‌ తన జీవితంలో ఎంతో ప్రత్యేకమైన రోజున అందంగా కనిపించిన విధానం అందర్నీ కట్టిపడేసింది. ఇక గౌతమ్‌ కిచ్లు.. అనితా డోంగ్రే డిజైన్‌ చేసిన తెలుపు రంగు షేర్వాణీలో తళుక్కుమన్నారు. దీని విలువ రూ.1,15,000. పెళ్లికి ముందు రోజు ఏర్పాటు చేసిన మెహెందీ ఫంక్షన్‌లో కాజల్‌ ఆకుపచ్చ కుర్తాలో కనిపించారు. ఇది కూడా అనితా డోంగ్రే ఔట్‌ఫిట్‌ కావడం విశేషం. దీని ధర రూ.24,500. వెబ్‌సైట్‌లో ఈ డ్రెస్‌ అందుబాటులో ఉంది.

కరోనా కష్టకాలంలో పెళ్లి ఏర్పాట్లు చేయడం సవాలుతో కూడుకున్న పనని కాజల్‌ శనివారం సాయంత్రం పేర్కొన్నారు. ‘మేమంతా కొవిడ్‌-19 నిబంధనలను కఠినంగా పాటించాం. అందుకే ఇలా చిన్న వేడుకగా వివాహం జరుపుకొన్నాం. శుభకార్యానికి వచ్చిన అతిథులకు కరోనా పరీక్షలు చేయించాం. పెళ్లికి హాజరైన ప్రియమైన వారికి ధన్యవాదాలు. చాలా మందిని మేమంతా మిస్‌ అయ్యాం. వారిని త్వరలోనే కలుస్తానని ఆశిస్తున్నా’ అని పోస్ట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని