Vikram: ‘విక్రమ్‌’ బాక్సాఫీస్‌ వేట.. రూ.150 కోట్లు ఆ రాష్ట్రం నుంచే‌..!

చాలా సంవత్సరాల తర్వాత అగ్ర కథానాయకుడు కమల్‌హాసన్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన చిత్రం ‘విక్రమ్‌’. గ్యాంగ్‌స్టర్‌ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాలో కమల్‌హాసన్‌తోపాటు విజయ్‌ సేతుపతి, ఫహద్‌....

Published : 20 Jun 2022 02:07 IST

చెన్నై: చాలా సంవత్సరాల తర్వాత అగ్ర కథానాయకుడు కమల్‌హాసన్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన చిత్రం ‘విక్రమ్‌’. గ్యాంగ్‌స్టర్‌ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాలో కమల్‌తోపాటు విజయ్‌ సేతుపతి, ఫహద్‌ ఫాజిల్‌ కీలకపాత్రలు పోషించారు. ఇక, అతిథి పాత్రలో కనిపించిన సూర్య ‘రోలెక్స్‌’గా అదరగొట్టేశారు. ఇంతమంది హీరోలు ఒకే స్క్రీన్‌పై మెరుపులు మెరిపించడంతో.. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. విడుదలైన 16 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లు వసూళ్లు రాబట్టిందని సినీ విశ్లేషకుల అంచనా. ఈ మొత్తం కలెక్షన్స్‌లో సగం అంటే రూ.150 కోట్లు కేవలం తమిళనాడు నుంచే వచ్చాయట. దీంతో ఇప్పటివరకూ ఆ రాష్ట్రంలో ఉన్న ‘బాహుబలి-2’ కలెక్షన్స్‌ రికార్డుని ‘విక్రమ్‌’ బద్దలు కొట్టింది. రానున్న రోజుల్లో ఈ సినిమా మరిన్ని రికార్డులు సృష్టించే దిశగా దూసుకెళ్తోంది.

అసలు ఈ సినిమా కథేంటంటే:

‘విక్రమ్‌’... పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌. గ్యాంగ్‌స్టర్‌, ఆయన్ని పట్టుకునేందుకు రంగంలోకి దిగిన పోలీస్‌ బృందానికి మధ్య జరిగే పోరు ఇది. ఇందులో కమల్‌హాసన్‌.. కర్ణన్‌ అనే పాత్రలో నటించారు. భారీగా మాదకద్రవ్యాలను పట్టుకున్న పోలీస్‌ అధికారి ప్రభంజన్‌, ఆయన తండ్రి కర్ణన్‌ (కమల్‌హాసన్‌)ను ఓ ముఠా చంపేస్తుంది. ఈ డ్రగ్స్‌ దందాను నిలువరించి, హత్యలకు పాల్పడుతున్న ఆ ముఠాను పట్టుకునేందుకు అమర్‌(ఫహద్‌ ఫాజిల్‌) అనే స్పై ఏజెంట్‌, అండర్‌ కవర్‌ ఆఫీసర్‌ రంగంలోకి దిగుతాడు. కేసు దర్యాప్తు చేస్తోన్న సమయంలో ఈ డ్రగ్స్‌ మాఫియా వెనుక సంతానం (విజయ్‌ సేతుపతి) హస్తం ఉన్నట్లు గుర్తిస్తాడు. అంతేకాకుండా కర్ణన్‌ బతికే ఉన్నట్లు తెలుసుకుంటాడు. అసలు కర్ణన్‌ ఎవరు? చనిపోయినట్లు ఎందుకు బయటప్రపంచాన్ని నమ్మించాడు? అమర్‌ ఈ కేసును ఎలా చేధించాడు? రోలెక్స్‌ (సూర్య) పాత్ర ఏమిటి?.. ఇలాంటి ఎన్నో ఆసక్తికర అంశాలతో లోకేశ్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అనిరుధ్‌ స్వరాలు సమకూర్చారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని