Kamal Haasan: ఆయన్ని చూస్తే చాలా అసూయగా ఉంది: కమల్‌ హాసన్‌

‘పొన్నియిన్‌ సెల్వన్‌ 2’ (Ponniyin Selvan 2) ట్రైలర్‌ లాంఛ్‌ ఈవెంట్‌కు కమల్‌ హాసన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ  ఈ సినిమా రిలీజ్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.

Published : 30 Mar 2023 11:34 IST

హైదరాబాద్‌: ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కడ విన్నా ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 2’ (Ponniyin Selvan 2) గురించే వినిపిస్తోంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. అంచనాలు పెంచేలా ఉన్న ఈ ట్రైలర్‌ ప్రస్తుతం సినీ ప్రియులకు ఆకట్టుకుంటూ ట్రెండింగ్‌లో ఉంది. ఇక ఈ ట్రైలర్‌ లాంఛ్‌ ఈవెంట్‌కు లెజెండరీ యాక్టర్‌ కమల్‌ హాసన్‌ (Kamal Haasan) అతిథిగా హాజరయ్యారు. అందులో ఆయన మాట్లాడుతూ దర్శకుడు మణిరత్నం (Mani Ratnam) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

అందరి లాగే తానూ ‘పొన్నియిన్‌ సెల్వన్‌2’ కోసం ఎదురుచూస్తున్నట్లు కమల్‌ హాసన్‌ తెలిపారు. ఇంత మంచి చిత్రంలో తాను కూడా భాగం కావాలని భావించి ఈ సినిమాకు వాయిస్‌ ఓవర్‌ ఇచ్చినట్లు చెప్పారు. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ..‘‘పొన్నియిన్‌ సెల్వన్‌2’ లాంటి గొప్ప సినిమాలో అవకాశాన్ని కోల్పోకూడదని అనుకున్నా. అందుకే వాయిస్‌ ఓవర్‌ ఇచ్చి ఇందులో భాగమయ్యాను. నాకు మణిరత్నాన్ని చూస్తే చాలా అసూయగా ఉంటుంది. అసలు ఇంత గొప్ప ఆలోచనలు ఆయనకు ఎలా వస్తాయో నాకు అర్థం కాదు. సినిమా ఎలా ఉండనుందనే విషయం ట్రైలర్‌ చూస్తే అర్థమవుతుంది. ఇటీవల ఈ సినిమాలోని పాటలను విన్నాను. వాటిని వర్ణించడానికి నాకు మాటలు కూడా రావడం లేదు.. అంత అద్భుతంగా ఉన్నాయి. సినిమా రంగంలో అవకాశాలు చాలా తక్కువ మందికి వస్తాయి. వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్లాలి’’ అంటూ ఇన్ని రోజులుగా తనను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కమల్ హాసన్‌ ధన్యవాదాలు చెప్పారు.

ఇక గతేడాది విడుదలైన ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ కు సీక్వెల్‌గా  ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 2’ (Ponniyin Selvan 2) తెరకెక్కుతోంది. మణిరత్నం దర్శకత్వంలో రానున్న ఈ చిత్రంలో విక్రమ్‌ (Chiyaan Vikram), కార్తి (Karthi), జయం రవి, త్రిష (Trisha), ఐశ్వర్యరాయ్‌ (Aishwarya Rai), శరత్‌కుమార్‌ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రం ఏప్రిల్‌ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని