Kangana Ranuat: విలేకరిపై కంగన ఫైర్‌

బాలీవుడ్‌ స్టార్‌హీరోయిన్‌ కంగనా రనౌత్‌ ఓ విలేకరిపై ఫైర్‌ అయ్యారు. రియాల్టీ షో ప్రెస్‌మీట్‌లో అందరి ముందు.. ‘ఇక కూర్చొ’ అంటూ విలేకరిని ఉద్దేశించి అన్నారు. ఇంతకీ ఆమె అంతలా ఆగ్రహానికిలోను కావడానికి కారణమేమిటంటే..

Updated : 04 Feb 2022 10:58 IST

ప్రెస్‌మీట్‌లో ఆ ప్రశ్న అడగటంతో ఆగ్రహం వ్యక్తం చేసిన నటి

ముంబయి: బాలీవుడ్‌ స్టార్‌హీరోయిన్‌ కంగనా రనౌత్‌ ఓ విలేకరిపై ఫైర్‌ అయ్యారు. రియాల్టీ షో ప్రెస్‌మీట్‌లో అందరి ముందు.. ‘ఇక కూర్చొ’ అంటూ విలేకరిని ఉద్దేశించి అన్నారు. ఇంతకీ ఆమె అంతలా ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణమేమిటంటే.. కంగనారనౌత్‌ వ్యాఖ్యాతగా పరిచయం కానున్న రియాల్టీ షో ‘లాక్‌ అప్‌’. ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్‌ నిర్మించనున్న ఈ రియాల్టీ షో మరికొన్ని రోజుల్లో ఏఎల్‌టీ బాలాజీ, ఎంఎక్స్‌ ప్లేయర్‌ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ వేదికగా అందుబాటులో ఉండనుంది. కాగా, ఈ షో ఫార్మాట్‌ను తెలియజేస్తూ గురువారం సాయంత్రం విలేకర్ల సమావేశం నిర్వహించారు.

కాగా, ఇందులో పాల్గొన్న కంగనా.. విలేకర్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ‘‘ఏక్తాకపూర్‌ క్రియేట్‌ చేసిన కాన్సెప్ట్‌ నాకెంతో నచ్చింది. అందుకే షో చేసేందుకు ఓకే చెప్పా’’ అని కంగన చెప్పగానే.. మరో విలేకరి మాట్లాడుతూ.. ‘‘మేడమ్‌ ఈ మధ్య కాలంలో మహిళ ధరించిన దుస్తులు ఆధారంగా ఎదుటివాళ్లు ఆమె ప్రవర్తనపై కామెంట్‌ చేస్తున్నారు. ఇటీవల దీపికా పదుకొణె సైతం ఈవిధంగా నెగటివిటీ ఎదుర్కొన్నారు. ‘గెహ్రియాన్‌’ ప్రమోషన్స్‌లో ఆమె ధరించిన దుస్తులపై విపరీతంగా కామెంట్లు వచ్చాయి. దీనిపై మీరు ఎలా స్పందిస్తారు’’ అని అడగ్గా.. ‘‘చూడండి, తమను తాము రక్షించుకోలేని వారిని రక్షించడానికి నేను ఇక్కడ ఉన్నాను. సరేనా? ఆమె (దీపికాపదుకొణె) తనను తాను రక్షించుకోగలదు. ఆమెకు ఆ అధికారం ఉంది. ముఖ్యంగా, ఆమె సినిమాని ఈ ప్లాట్‌ఫామ్‌పై ప్రమోట్‌ చేయను. కాబట్టి, మీరు కూర్చొండి’’ అని కంగన అసహనం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని