Emergency: కంగన డైరెక్టర్‌గా ఇందిరా గాంధీపై చిత్రం

బాలీవుడ్‌ వివాదాస్పద నటి కంగన మరోసారి మెగాఫోన్‌ పట్టనుంది. గతంలో ‘మణికర్ణిక’ చిత్రంతో దర్శకత్వ బాధ్యతలు చేపట్టిందామె. ఇప్పుడు ఆమె డైరెక్షన్‌లో మరో సినిమా తెరకెక్కనుంది.

Published : 24 Jun 2021 19:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ వివాదాస్పద నటి కంగన మరోసారి మెగాఫోన్‌ పట్టనుంది. గతంలో ‘మణికర్ణిక’ చిత్రంతో దర్శకత్వ బాధ్యతలు చేపట్టిందామె. ఇప్పుడు ఆమె డైరెక్షన్‌లో మరో సినిమా తెరకెక్కనుంది. భారత మాజీ ప్రధాని, దివంగత ఇందిరా గాంధీ కథ ఆధారంగా ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుంది. దర్శకత్వంతో పాటు ఇందిరా గాంధీ పాత్రను కంగన పోషించనున్నట్లు తెలుస్తోంది. ‘ఎమర్జెన్సీ’ పేరుతో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు కంగన ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఇప్పటికే  చిత్రనిర్మాణ పనులను కూడా ప్రారంభించిందామె. ఈ సినిమాను మరెవరూ తనకంటే గొప్పగా డైరెక్ట్‌ చేయలేరని ధీమా వ్యక్తం చేసింది. డైరెక్టర్‌గా మారే క్రమంలో నటిగా కొన్ని అవకాశాలు వదులుకోవాల్సి వచ్చినా.. వాటిని పట్టించుకోనని చెప్పింది.

‘‘దర్శకురాలిగా టోపీ మళ్లీ ధరించడం ఆనందంగా ఉంది. ‘ఎమర్జెన్సీ’ కోసం ఏడాది నుంచి పని చేస్తున్నాను. ఈ సినిమాకు నాకంటే బాగా ఎవ్వరూ దర్శకత్వం చేయలేరని భావిస్తున్నాను. రచయిత రితేష్ షా కథ అందిస్తున్నారు. ఈ సినిమా తీసే క్రమంలో నటిగా కొన్నింటిని త్యాగం చేయాల్సి వస్తోంది. అయినా అవన్నీ పట్టించుకోను. ఇది ఒక అద్భుతమైన ప్రయాణం కానుంది. ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాను’’ అని ఆమె చెప్పుకొచ్చింది. 

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలిత పాత్రలో కంగన నటించిన ‘తలైవి’ విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతోపాటు మరో చిత్రం ‘తేజాస్‌’లో ఆమె ఎయిర్‌ఫోర్స్‌ పైలట్‌గా నటించింది. అంతేకాదు.. ‘మణికర్ణిక రిటర్న్స్‌’ పేరుతో రానున్న చిత్రంలో కంగన మరోసారి ఝాన్సీరాణిగా కనిపించనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని