Kantara: అందుకే ‘కాంతార’ ఆస్కార్‌కు నామినేట్‌ కాలేకపోయింది: విజయ్‌ కిరగందూర్‌

రిషబ్‌శెట్టి స్వీయ దర్శకత్వంలో నటించిన చిత్రం ‘కాంతార’. ఇది ఆస్కార్‌కు ఎందుకు నామినేట్‌కాలేకపోయిందో నిర్మాత విజయ్‌ కిరగందూర్‌ చెప్పారు.

Published : 01 Feb 2023 01:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రచారానికి తగిన సమయంలేకపోవడం వల్లే ‘కాంతార’ (Kantara) ఆస్కార్‌కు నామినేట్‌కాలేకపోయిందని అభిప్రాయపడ్డారు నిర్మాత విజయ్‌ కిరగందూర్‌ (Vijay Kirgandur). ‘కాంతార 2’కు ఆస్కార్‌ అవార్డు గానీ (Oscars Nominations 2023), గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుగానీ వచ్చేలా పని చేస్తున్నామని ఆయన తెలిపారు. ‘కేజీయఫ్‌’ (KGF) సిరీస్‌ చిత్రాలతో మంచి గుర్తింపు పొందిన నిర్మాతాయన. హోంబలే ఫిల్మ్స్‌ బ్యానర్‌పై వచ్చే ఐదేళ్లలో తాము నిర్మించే చిత్రాల్లో ‘కాంతార 2’ (Kantara 2) ఒకటి. గతేడాది చిన్న చిత్రంగా విడుదలై, పెద్ద విజయాన్ని అందుకున్న ‘కాంతార’కు ప్రీక్వెల్‌గా రూపొందనుంది. ‘కాంతార 2’తోపాటు మరికొన్ని సినిమాల గురించి విజయ్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

‘‘కొవిడ్‌ సమయం నుంచి ఓటీటీకి ఆదరణ పెరిగింది. విభిన్న నేపథ్యాల సినిమాలు/సిరీస్‌లను ప్రేక్షకులు చూశారు. వారు ఇప్పటి వరకూ చూడని కంటెంట్‌ను అందించడమే ఫిల్మ్‌మేకర్స్‌ ముందున్న లక్ష్యం. మనం మన మూలాల్ని ప్రపంచానికి తెలియజేయాలి. కాంతార, ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాల ద్వారా జరిగిందదే. సినిమాలే కాకపోయినా కనీసం డాక్యుమెంటరీ రూపంలో మన సంస్కృతిని తెరపైకి తీసుకురావాలి. ‘కాంతార’ వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు కర్ణాటకలోని తుళు నాడు కల్చర్‌ గురించి తెలుసుకున్నారు. వారి అభిరుచి మేరకు అలాంటి కథలపై దృష్టి పెడుతున్నాం. సెప్టెంబరులో (2022) విడుదలకావడం వల్ల అంతర్జాతీయ స్థాయిలో ‘కాంతార’ను ప్రచారం చేయలేకపోయాం. అందుకే ఆస్కార్‌, గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డులకు నామినేట్‌కాలేదనుకుంటున్నా. ఆ లోటును ‘కాంతార 2’ తీర్చేలా కష్టపడతాం. 2024 ద్వితీయార్థంలో విడుదలకు ప్లాన్‌ చేస్తున్నాం. ప్రస్తుతం మా నిర్మాణ సంస్థలో ‘సలార్‌’, ‘ధూమమ్‌’, ‘రఘుతాత’, ‘భగీర’ తెరకెక్కుతున్నాయి. యువ రాజ్‌కుమార్‌ (రాజ్‌కుమార్‌ మనవడు)ను హీరోగా పరిచయబోతున్న ప్రాజెక్టు త్వరలోనే ప్రారంభమవుతుంది. కొన్ని వెబ్‌సిరీస్‌లు నిర్మించేందుకు కథలు వెతుకుతున్నాం’’ అని విజయ్‌ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని