Rishab Shetty: పొలిటికల్‌ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన ‘కాంతార’ హీరో

తాను రాజకీయాల్లోకి రావడం లేదని కాంతార హీరో రిషబ్‌ శెట్టి (Rishab Shetty) మరోసారి స్పష్టం చేశాడు. తన సినిమాలకు మద్దతిస్తున్నవారికి ధన్యవాదాలు తెలిపారు.

Published : 02 Apr 2023 14:10 IST

హైదరాబాద్‌: ‘కాంతార’ (Kantara) సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో రిషబ్‌ శెట్టి. భాషతో సంబంధం లేకుండా భారీగా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నాడు. తాజాగా ఈ క్రేజీ హీరోకు సంబంధించిన ఓ వార్త కన్నడ నాట చర్చనీయాంశంగా మారింది. రిషబ్‌ (Rishab Shetty) త్వరలోనే రాజకీయాల్లోకి రానున్నాడనే వార్త గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. తాజాగా ఈ విషయంపై కాంతార హీరో క్లారిటీ ఇచ్చాడు. 

ట్విటర్‌లో రిషబ్‌ ఫొటో షేర్‌ చేసిన ఓ జర్నలిస్ట్‌ ‘రిషబ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు.. ఇది ఈ రోజు అతిపెద్ద వార్త’ అని రాసి రిషబ్‌ను ట్యాగ్‌ చేశారు. ఆ ట్వీట్‌కు రిషబ్‌ రిప్లై ఇస్తూ.. ‘‘నేను రాజకీయాల్లోకి రానున్నానంటూ వస్తోన్న వార్త నిజం కాదు. ఇది రూమర్‌ మాత్రమే. నేను పాలిటిక్స్‌లోకి రావడం లేదు’’ అని స్పష్టం చేశారు. ఇప్పటికే కొంతమంది తన పార్టీలో చేరారని కూడా రాస్తున్నారంటూ నవ్వుతున్న ఎమోజీలను రిషబ్‌ పోస్ట్‌ చేశారు. ‘మీరు రాజకీయాల్లోకి రండీ మేము మద్దతు ఇస్తామని’ కొందరు అభిమానులు కామెంట్స్‌ పెట్టగా.. రిషబ్‌ వారికి కూడా  రిప్లై ఇచ్చారు. తనకు రాజకీయపరమైన మద్దతు వద్దన్నారు. తన సినిమాలను ఆదరిస్తే చాలని చెప్పారు. తనపై ఇంత ప్రేమాభిమానాలు చూపుతోన్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం ఈ ట్వీట్లు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి.

చిన్న సినిమాగా విడుదలై కోట్లు వసూళ్లు చేసిన ‘కాంతార’ సినిమా రెండో భాగం (Kantara2) కోసం సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఈ సీక్వెల్‌పై రిషబ్‌ మాట్లాడారు. రెండో భాగం సీక్వెల్‌ కాదని ప్రీక్వెల్ అని పేర్కొన్నారు. తొలి భాగం కథ ఎక్కడైతే ప్రారంభమైందో.. దానికి ముందు జరిగిన సంఘటనలను రెండో భాగంలో చూపనున్నట్లు చెప్పారు. అలాగే పంజుర్లికి సంబంధించిన సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. ఈ ప్రీక్వెల్‌ను 2024లో విడుదల చేసే అవకాశమున్నట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని