Kashmir Files Row: నిజాన్ని చూడలేకపోతే.. నోరు మూసుకోండి: అనుపమ్ ఖేర్‌

‘ది కశ్మీర్ ఫైల్స్‌’ చిత్రంపై ఇజ్రాయెల్‌ దర్శకుడు చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ నటుడు అనుపమ్‌ ఖేర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాలో వాస్తవాలను చూపించడం కొందరికి రుచించట్లేదంటూ మండిపడ్డారు.

Published : 29 Nov 2022 15:52 IST

ఇంటర్నెట్ డెస్క్‌: అంతర్జాతీయ భారతీయ చలన చిత్రోత్సవం(ఇఫి)లో ‘ది కశ్మీర్ ఫైల్స్‌’ చిత్రంపై జ్యూరీ హెడ్‌, ఇజ్రాయెల్‌ దర్శకుడు నడవ్‌ లాపిడ్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. లాపిడ్‌ వ్యాఖ్యలను ఆయన సొంత దేశ దౌత్యవేత్తలే తీవ్రంగా ఖండిస్తూ భారత్‌కు క్షమాపణలు తెలిపారు. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌.. ఇజ్రాయెల్‌ దర్శకుడి వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాలు చూడలేకపోతే.. నోరు మూసుకుని కూర్చోవాలంటూ మండిపడ్డారు. ఈ మేరకు ‘కశ్మీర్‌ ఫైల్స్‌’ చిత్రంపై విమర్శలు చేస్తున్న వారిని ఉద్దేశిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో విడుదల చేశారు.

‘‘కొందరికి నిజాలను ఉన్నది ఉన్నట్లుగా చూపించే అలవాటు ఉండదు. దాన్ని తమకు ఇష్టమొచ్చినట్లుగా మార్చి చూపిస్తుంటారు. అలాంటి వారు కశ్మీర్‌ నిజాలను జీర్ణించుకోలేకపోతున్నారు. గత 25-30 ఏళ్లుగా కశ్మీర్‌ను మరో కోణంలో చూపిస్తున్నారు. దాన్ని కశ్మీర్‌ ఫైల్స్‌ బహిర్గతం చేసింది. సినిమాలో నిజాలను చూపించడం వారికి రుచించట్లేదు. అందుకే సత్యాన్ని అపహాస్యం చేసేందుకు ఏ అవకాశాన్నీ వదిలిపెట్టట్లేదు. మీరు వాస్తవాలను చూడలేకపోతే.. కళ్లు మూసుకోండి. నోరు మూసుకోండి. ఎందుకంటే ఇదే మా కశ్మీర్‌లో జరిగిన నిజం. ఇది మా విషాద చరిత్రలో ఒక భాగం. మీకు అది తెలియకపోతే.. ఆ విషాదాన్ని అనుభవించిన వారిని కలిసి తెలుసుకోండి. భారత్‌, ఇజ్రాయెల్‌.. రెండు దేశాలూ ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్నాయి. అందువల్ల కశ్మీరీ హిందువుల బాధను ఇజ్రాయెల్‌లో సామాన్య వ్యక్తి కూడా అర్థం చేసుకోగలరు. అయితే.. ప్రతి దేశంలోనూ దేశద్రోహులు ఉంటారు కదా’’ అని అనుపమ్‌ ఖేర్‌ మండిపడ్డారు. తమది కేవలం సినిమా మాత్రమే కాదని, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే ఉద్యమమని ఖేర్‌ ఈ సందర్భంగా అన్నారు. ఈ ఉద్యమాన్ని అడ్డుకునేందుకు టూల్‌కిట్‌ గ్యాంగ్‌లు ప్రయత్నిస్తూనే ఉంటాయని ఆరోపించారు.

అనుపమ్‌ ఖేర్‌కు ఇజ్రాయెల్‌ దౌత్యవేత్త క్షమాపణలు..

ఇఫి జ్యూరీ హెడ్‌ లాపిడ్‌ వ్యాఖ్యలను భారత్‌లోని ఇజ్రాయెల్‌ రాయబారి నావొర్‌ గిలాన్‌ ఖండించిన విషయం తెలిసిందే. భారత ప్రభుత్వానికి ఆయన క్షమాపణలు కూడా తెలిపారు. తాజాగా భారత్‌లోని ఇజ్రాయెల్‌ కాన్సుల్‌ జనరల్ కొబ్బి షొషానీ కూడా లాపిడ్ వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విషయం తెలియగానే ఆయన అనుపమ్‌ ఖేర్‌కు స్వయంగా ఫోన్‌ చేసి క్షమాపణలు తెలియజేశారు. ‘‘లాపిడ్‌ వ్యాఖ్యలు పూర్తిగా ఆయన వ్యక్తిగతమే. దీనికి ఇజ్రాయెల్‌తో అధికారికంగా గానీ, అనధికారికంగా గానీ ఎలాంటి సంబంధం లేదు. అయితే ఈ విషయం గురించి తెలియగానే నేను నా స్నేహితుడు అనుపమ్‌ ఖేర్‌కు ఫోన్‌ చేసి క్షమాపణలు చెప్పాను. కశ్మీర్‌ ఫైల్స్‌ ప్రచార చిత్రం కాదు. కశ్మీరీల బాధలను చెప్పిన బలమైన చిత్రం’’ అని షొషానీ అన్నారు.

గోవాలో జరిగిన అంతర్జాతీయ భారతీయ చలనచిత్రోత్సవం (ఇఫి)లో ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ చిత్రాన్ని ప్రదర్శించారు. దీనిపై ఇఫి జ్యూరీ హెడ్‌ నడవ్‌ లాపిడ్‌ ముగింపు వేడుకల్లో మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా చూసి దిగ్భ్రాంతి చెందా. ఇది ప్రచారం కోసం తీసిన అసభ్యకర చిత్రం’’ అని వ్యాఖ్యానించారు. దీంతో ఇది కాస్తా తీవ్ర వివాదాస్పదమైంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని