keerthy suresh: పెళ్లి కుదిరితే నేనే స్వయంగా ప్రకటిస్తాను..: కీర్తి సురేశ్‌

గత కొన్ని రోజులుగా కీర్తి సురేశ్‌ (keerthy suresh) పెళ్లిపై రూమర్స్‌ వస్తున్నాయి. తాజాగా వీటిపై ఆమె స్పందిస్తూ అసహనం వ్యక్తం చేసింది.

Published : 04 Jun 2023 11:00 IST

హైదరాబాద్‌: మహానటి కీర్తి సురేశ్‌ (keerthy suresh) పేరు కొన్నిరోజులుగా నిత్యం వార్తల్లో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు ఈ అమ్మడు తన పెళ్లికి సంబంధించిన రూమర్స్‌కు చెక్‌ పెడుతూ వస్తుంది. ఇటీవల కీర్తి తండ్రి కూడా ఈ విషయంపై స్పందిస్తూ ఒక వీడియో విడుదల చేశారు. అయినా ఈ వార్తలు ఆగడం లేదు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న కీర్తిని కొందరు డైరెక్ట్‌గా పెళ్లి గురించి అడిగారు. దీంతో ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

తమిళంలో కీర్తి నటించిన తాజా చిత్రం ‘మామన్నన్‌’ ఆడియో రిలీజ్‌ వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రెస్‌మీట్‌ ఏర్పాటుచేసింది. అందులో ఆమె మాట్లాడుతుండగా కొందరు.. త్వరలో పెళ్లిపీటలెక్కనున్నారట నిజమేనా.. అంటూ వరుస ప్రశ్నలు వేశారు. దీంతో  కీర్తి ‘‘నా పెళ్లిపై వస్తున్న రూమర్స్‌ గురించి నేను ఇప్పటికే ఎన్నోసార్లు క్లారిటీ ఇచ్చాను. మీరంతా దాని గురించే ఎందుకు అడుగుతున్నారు..? ఆ విషయంపై ఎందుకింత ఆసక్తిగా ఉన్నారు..? నాకు పెళ్లి కుదిరితే నేనే స్వయంగా ప్రకటిస్తాను. దాని గురించి మీరు ప్రెస్‌మీట్‌లలో ప్రతిసారి అడగొద్దు. ఇలాంటి ప్రశ్నలు కాదు..  సినిమాకు సంబంధించినవి అడగండి’’ అని చెప్పింది.

ఇటీవల కీర్తి తండ్రి సురేష్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ‘‘ మా అమ్మాయి పెళ్లి కుదిరితే మీడియాకు, ప్రజలకు ముందుగా మేమే చెబుతాం. ఇలాంటి సున్నితమైన విషయాలపై రూమర్స్‌ క్రియేట్‌ చేయొద్దు. దీని కారణంగా కుటుంబంలో మనశ్శాంతి కరవవుతుంది’’ అని చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా కీర్తి ఇచ్చిన సమాధానంతోనైనా ఈ వార్తలు ఆగుతాయేమో చూడాలి. ప్రస్తుతం ఈ అమ్మడు ‘భోళా శంకర్‌’ (Bhola Shankar)లో మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) చెల్లిగా నటిస్తోంది. దీనితో పాటు  ‘రఘు తాత’ (Raghu Thatha)లోనూ కనిపించనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని