Kota Srinivas Rao: హీరోల పారితోషికం బయటకు చెప్పటంపై కోట మండిపాటు!

Kota Srinivas Rao: హీరోలు తాము తీసుకుంటున్న పారితోషికం గురించి బయటకు చెప్పటాన్ని సీనియర్‌ నటుడు కోట శ్రీనివాసరావు తప్పుపట్టారు.

Published : 04 Jun 2023 01:46 IST

హైదరాబాద్‌: హీరోలు అందుకుంటున్న పారితోషికాల గురించి బహిరంగంగా మాట్లాడటంపై సీనియర్‌ నటుడు కోట శ్రీనివాసరావు (Kota Srinivas Rao) అభ్యంతరం వ్యక్తం చేశారు. అలా చెప్పడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్‌ మెమోరియల్‌ అవార్డ్స్‌ కార్యక్రమం జరిగింది. ఇందులో పాల్గొన్న ఆయన తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక విజ్ఞప్తి చేశారు.

‘‘ఎన్టీఆర్‌, ఏయన్నార్‌, కృష్ణ, శోభన్‌బాబు తదితర నటులు ఎప్పుడూ తాము తీసుకున్న రెమ్యూనరేషన్‌ గురించి బయటకు చెప్పలేదు. ఎవరికి ఎవరు ఎంత ఇచ్చారు? అన్న సంగతి ఎవరికీ తెలియదు. అలాంటిది ఇవాళ కొందరు మైక్‌ పట్టుకుని, ‘రోజుకు రెండు కోట్లు తీసుకుంటాను.. ఆరు కోట్లు తీసుకుంటాను. 40 రోజులకు రూ.80 కోట్లు వస్తాయి’ అని చెబుతున్నారు. ఇలా చెప్పడం మంచి పద్ధతి కాదు. 60ఏళ్ల వయసులోనూ ఎన్టీఆర్‌ నటిస్తుంటే ఆయన వయసు తెలిసేది కాదు. శ్రీదేవితో కలిసి తెరపై కనిపిస్తే, ఎన్టీఆర్‌-శ్రీదేవి భలే చేశారని అనేవాళ్లు. రామారావు మళ్లీ పుడితే తప్ప మరో రామారావు లేడు.’’

‘‘మా’ అసోసియేషన్‌కు నాదే ఒకటే విజ్ఞప్తి. తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది చిన్న ఆర్టిస్టులు ఉన్నారు. వారిలో ఎంతమంది రెండు పూటలా భోజనం చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఒక సినిమా కోసం అందరూ తెలుగు నటీనటులు, సాంకేతిక నిపుణులు పనిచేస్తూ రూ.10కోట్ల కన్నా తక్కువ బడ్జెట్‌తో సినిమా చేస్తే, తెలుగు రాష్ట్రాల్లో ఉచితంగా షూటింగ్‌ చేసేందుకు ప్రభుత్వాలు అవకాశం కల్పించాలని ‘మా’తరపున ఒక లేఖ రాయండి. అలాగే చిన్న సినిమాలకు వివిధ రాయితీలు ఇచ్చేలా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయండి. అప్పుడు చిన్న సినిమా బతుకుతుంది. నటీనటులకు కూడా మూడు పూటలా భోజనం దొరుకుతుంది. సినిమా అవకాశాలు లేక ప్రకటనలు చేద్దామనుకుంటే, టాయ్‌లెట్‌ బ్రష్ దగ్గరి నుంచి బంగారం వరకూ హీరోలే చేస్తున్నారు’’ అని కోట శ్రీనివాసరావు అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని