Prabhas: ‘చక్రం’ వద్దని ప్రభాస్‌కు చెప్పిన కృష్ణవంశీ

ప్రభాస్‌ (Prabhas).. ప్రస్తుతం ఇండియన్‌ సినిమాకు పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు నటుడిగా

Published : 05 Sep 2022 16:13 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రభాస్‌ (Prabhas).. ప్రస్తుతం ఇండియన్‌ సినిమాకు పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు నటుడిగా సినిమాలు చేయడం మొదలు పెట్టి, ‘బాహుబలి’తో పాన్‌ ఇండియా స్టార్‌ అయ్యారు. అయితే, ఆయన కెరీర్‌లో చేసిన వైవిధ్య చిత్రం ‘చక్రం’. క్రియేటివ్‌ డైరెక్టర్‌గా ఇండస్ట్రీలో పేరుతెచ్చుకున్న కృష్ణవంశీ (krishna vamsi) దాన్ని తెరకెక్కించారు. విషాదాంత కథతో కూడుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద పరాజయాన్ని చవిచూసింది. కాగా, ఓ ఇంటర్వ్యూలో ‘చక్రం’ మూవీని ప్రభాస్‌ చేయడం వెనుక ఉన్న కారణాన్ని కృష్ణవంశీ పంచుకున్నారు.

‘‘ప్రభాస్‌తో సినిమా చేద్దామనుకున్నప్పుడు రెండు రకాల కథలు చెప్పా. అందులో ఒకటి ‘చక్రం’. మరొక మూవీ రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో జరుగుతుంది. ఫ్యాక్షన్‌ కాకుండా గుప్తనిధులు అనే కాన్సెప్ట్‌ గురించి వివరించాను. రాయలసీమ జిల్లాల్లోని చాలా ఊళ్లల్లో గుప్తనిధుల కోసం ఇప్పటికీ వెతుకుతూ ఉంటారు.  ఆ నిధుల కోసం కొన్ని తరాలు అలా వెతుకుతూనే ఉంటాయి. ఆ నేపథ్యంతో సినిమా చేద్దామన్నా. విశాలమైన మట్టి ప్రాంతాలు, దుమ్ములేపే వెహికల్స్‌, గుర్రాలపై ఛేజింగ్స్‌, ఫైట్స్‌తో ఒక యాక్షన్‌ ప్యాక్డ్‌ మూవీ అవుతుందని చెప్పా. కానీ, ప్రభాస్‌ ‘చక్రం’ ఎంచుకున్నాడు. అప్పటికీ నేను వద్దని చెప్పా. ‘ప్రభాస్‌ నువ్వు ఇప్పుడు యాక్షన్‌  జోన్‌లో ఉన్నావు. ఈ సినిమా చేస్తే బాగుంటుంది’ అని అన్నాను. పైగా అప్పుడు ‘వర్షం’ కూడా విడుదలైంది. ‘సర్‌ నా దగ్గరకు అన్నీ ఇలాంటి కథలే వస్తున్నాయి. మంచి నటనా ప్రాధాన్యం ఉన్న చిత్రంలో చేయడానికి నేను మీ దగ్గరకు  వచ్చా. మీరు ఏమీ అనుకోవద్దు. చక్రం చేద్దాం’’ అని ప్రభాస్‌ దాన్ని ఎంచుకున్నాడని అన్నారు.

సినిమా ఫలితం ఎలా ఉన్నా, ఎంతోమందికి జీవిత పాఠాలను నేర్పే అంశాలు అందులో ఉన్నాయి. అంతేకాదు, సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన ‘జగమంత కుటుంబం నాది.. ఏకాకి జీవితం నాది’ అంటూ సాగే పాట ఆల్‌టైమ్‌ హిట్‌. ప్రస్తుతం ప్రభాస్‌ పాన్‌ ఇండియా రేంజ్‌లో ‘సలార్‌’, ‘ఆది పురుష్‌’ చిత్రాలు చేస్తుండగా, కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని