Krishnam Raju: కృష్ణంరాజు మృతికి కారణమిదే.. వెల్లడించిన ఆస్పత్రి వర్గాలు

దిగ్గజ నటుడు కృష్ణంరాజు (krishnam raju) కన్నుమూయడంతో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు

Published : 11 Sep 2022 09:10 IST

హైదరాబాద్‌:  దిగ్గజ నటుడు కృష్ణంరాజు (krishnam raju) కన్నుమూయడంతో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కృష్ణంరాజు మృతికి గల కారణాన్ని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు ప్రకటన విడుదల చేశాయి.

‘‘82 ఏళ్ల కృష్ణంరాజు మధుమేహం, పోస్ట్ కోవిడ్, తీవ్రమైన కార్డియాక్ అరెస్ట్‌ రావడంతో చనిపోయారు. గుండె కొట్టుకునే వేగంతో చాలా కాలంగా సమస్య ఉంది. రక్తప్రసరణ సరిగా లేకపోవడంతో గతేడాది ఆయన కాలికి శస్త్రచికిత్స జరిగింది. దీర్ఘకాలంగా మూత్రపిండాలు, ఊపిరితిత్తుల సమస్యతోనూ కృష్ణంరాజు బాధపడుతున్నారు. పోస్ట్ కోవిడ్ సమస్యతో గత నెల 5వ తేదీన ఆస్పత్రిలో చేరారు. మల్టీ  డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా కారణంగా ఊపిరితిత్తుల్లో తీవ్ర న్యుమోనియా ఉన్నట్టు గుర్తించాం. కిడ్నీ పనితీరు పూర్తిగా దెబ్బతినడంతో ఆస్పత్రిలో చేరిన నాటి నుంచి వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించాం. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి గమనిస్తూ తగిన చికిత్స అందించాం. ఆదివారం తెల్లవారుజామున 3.16గంటలకు తీవ్రమైన గుండెపోటు రావడంతో కృష్ణంరాజు కన్నుమూశారు’’ అని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

కృష్ణం రాజు మృతిపట్ల సినీ, రాజకీయ వర్గాలు విచారం వ్యక్తం చేశాయి. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాయి. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత కృష్ణంరాజు పార్థివదేహాన్ని ఇంటికి తీసుకురానున్నారు. అనంతరం ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం అందుబాటులో ఉంచనున్నారు. సోమవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని