
Lata Mangeshker: లతా మంగేష్కర్ ఆరోగ్యంపై మంత్రి అప్డేట్!
జాల్నా: ఇటీవల కొవిడ్ బారినపడి ముంబయిలోని బ్రీచ్కాండీ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఆరోగ్యం మెరుగుపడుతోందని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్ టోపే వెల్లడించారు. 92 ఏళ్ల లతా మంగేష్కర్ ఈ నెల 11న స్వల్ప లక్షణాలతో కొవిడ్ బారినపడిన విషయం తెలిసిందే. దీంతో ఆమె వయస్సును దృష్టిలో ఉంచుకొని వైద్యులు ముందుజాగ్రత్తగా ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్ టోపే జాల్నాలో విలేకర్లతో ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడారు.
‘‘లతా మంగేష్కర్ ఆరోగ్యం మెరుగుపడుతోంది. ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నా. లతా ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవడం పట్ల ప్రజలు ఎంతో ఆసక్తి చూపిస్తున్నందున.. కుటుంబ సభ్యులతో చర్చించి ఎప్పటికప్పుడు ఆస్పత్రి అధికార ప్రతినిధి అప్డేట్స్ ఇచ్చేలా చూడాలని ఆస్పత్రి యాజమాన్యాన్ని కోరాను’’ అని మంత్రి వివరించారు. లతా మంగేష్కర్కు ఐసీయూలోనే చికిత్స కొనసాగుతోందని ఆస్పత్రి వైద్యుడు, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రతీత్ సమదాని ఈ ఉదయం తెలిపారు. మరోవైపు, లతా మంగేష్కర్ బాగానే ఉన్నారని, తమ కుటుంబ గోప్యతను కాపాడాలంటూ ఆమె మేనకోడలు రచనా షా గురువారం మీడియాకు విజ్ఞప్తి చేశారు.