Bollywood: అక్షయ్‌ సరసన పరిణితి?

అక్షయ్‌ కుమార్‌ కథానాయకుడిగా రానున్న చిత్రం ‘క్యాప్సుల్‌ గిల్‌’. 1989లో రాణిగంజ్‌ బొగ్గు గనుల్లో జరిగిన యథార్థ ఘటన ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది. ‘రుస్తం’ ఫేం టీనూ సురేష్‌ దేశాయీ దర్శకత్వం వహించనున్నారు. తాజాగా ఇందులో అక్షయ్‌ సరసన

Updated : 30 May 2022 07:01 IST

అక్షయ్‌ కుమార్‌ కథానాయకుడిగా రానున్న చిత్రం ‘క్యాప్సుల్‌ గిల్‌’. 1989లో రాణిగంజ్‌ బొగ్గు గనుల్లో జరిగిన యథార్థ ఘటన ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది. ‘రుస్తం’ ఫేం టీనూ సురేష్‌ దేశాయీ దర్శకత్వం వహించనున్నారు. తాజాగా ఇందులో అక్షయ్‌ సరసన కథానాయికగా  పరిణితీ చోప్రాను ఎంపిక చేశారని సమాచారం. 2019లో  విడుదలైన ‘కేసరి’లో ఈ జోడీ అలరించింది. భూ గర్భ గనుల్లో చిక్కుకుపోయిన 64 మంది కార్మికులను ప్రాణాలకు తెగించి రక్షించిన జశ్వంత్‌ సింగ్‌ గిల్‌ అనే ఇంజనీరు పాత్రలో అక్షయ్‌ కనిపించనున్నాడు.


భారత కామెరూన్‌ ఎవరంటే..?

ఆమిర్‌ ఖాన్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘లాల్‌ సింగ్‌ చద్ధా’. కరీనాకపూర్‌ ఖాన్‌, నాగచైతన్య ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. ఇది హాలీవుడ్‌ చిత్రమైన ‘ఫారెస్ట్‌ గంప్‌’ రీమేక్‌ అన్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి కొన్ని తెర వెనుక కథలు బయటకు వచ్చాయి. మాతృకకు సంబంధించిన రీమేక్‌ హక్కులను ఇవ్వడానికి ఆ చిత్ర దర్శకుడు రాబర్ట్‌ జెమెక్స్‌ తొలుత నిరాకరించాడు. ఈ విషయంలో సాయం చేయమని 2015లో ప్రఖ్యాత దర్శకుడు స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ను ఓ సినిమా సెట్లో ఆమిర్‌ కలుసుకున్నాడు. అక్కడే ఉన్న కథానాయకుడు టామ్‌ హ్యాంక్స్‌కు ఆమిర్‌ను ‘జేమ్స్‌ కామెరూన్‌ ఆఫ్‌ ఇండియా’అని పరిచయం చేశారట. ‘హా... నేను త్రీ ఇడియట్‌ చూశా’ అంటూ హ్యాంక్స్‌ ఆమిర్‌తో మాట్లాడారు. ఆ తర్వాత పలు ప్రయత్నాల అనంతరం ఆ చిత్ర హక్కులను ఆమిర్‌ దక్కించుకున్నాడు. ఇప్పటికే చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 11న విడుదల కానుంది.


పెళ్లి వేడుకలో ‘జుగ్‌ జుగ్‌ జియో’

ఫ్యామిలీ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం ‘జుగ్‌ జుగ్‌ జియో’. అనిల్‌ కపూర్‌, నీతూ కపూర్‌, వరుణ్‌ ధావన్‌, కియారా అడ్వాణీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రాజ్‌ మెహతా దర్శకుడు. జూన్‌ 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఈ సినిమా నుంచి తొలి పాటను విడుదల చేశారు. పూర్తి హుషారుగా సాగే ‘నాచ్‌ పంజాబన్‌’ అనే ఈ పాటతో వారి కుటుంబంలోని వివాహ వేడుకను మన కళ్లకు కట్టారు. తనిష్క్‌ బాగ్చీ, అబరార్‌ ఉల్‌ హక్‌ గేయ రచన చేశారు. వరుణ్‌ డ్యాన్స్‌, కియారా అందం ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.


కేన్స్‌లో చివరి రోజు..

ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన తారలతో అట్టహాసంగా జరిగిన కేన్స్‌ చిత్రోత్సవాలు శనివారంతో ముగిశాయి. జ్యూరీ సభ్యురాలి హోదాలో ఇన్ని రోజులూ సందడి చేసిన నటి దీపికా పదుకొణె కార్యక్రమం చివరి రోజు తెల్లటి చీరలో మెరిసిపోతూ కనిపించింది. ప్రస్తుతం దీపిక షారుఖ్‌ ఖాన్‌ ‘పఠాన్‌’తో పాటు ‘ది ఇంటర్న్‌’, ‘ఫైటర్‌’, ప్రభాస్‌ ‘ప్రాజెక్ట్‌ కె’ చిత్రాల్లో నటిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని