Rajamouli: రాజమౌళి- మహేశ్‌ కాంబో.. షూటింగ్‌ అప్‌డేట్‌ వచ్చేసింది!

ప్రముఖ దర్శకుడు రాజమౌళి, నటుడు మహేశ్‌బాబు కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కబోతుంది.

Published : 02 Apr 2022 01:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ దర్శకుడు రాజమౌళి, నటుడు మహేశ్‌ బాబు కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కబోతుంది. అధికారికంగా ప్రకటించకపోయినా పలు ఇంటర్వ్యూల్లో నిర్మాత కె. ఎల్‌. నారాయణ, రాజమౌళి ఈ విషయాన్ని వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ సమాచారం తెలిసిన క్షణం నుంచే సినీ అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. మహేశ్‌ బాబును రాజమౌళి ఎలాంటి పాత్రలో చూపిస్తారు? ఏ నేపథ్యంలో సినిమాను తెరకెక్కిస్తారు? హీరోయిన్‌ ఎవరు? టైటిల్‌ ఏంటి? అనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఈ క్రమంలో ఎన్నో ఊహాగానాలు వచ్చాయి. వాటిని పక్కన పెడితే, ఈ సినిమాను ఎప్పుడు ప్రారంభించబోతున్నారో రాజమౌళి ఆంగ్ల మీడియాకు తెలిపారు. ‘‘స్టోరీని పక్కాగా సిద్ధం చేసుకునేందుకు, ప్రీ ప్రొడక్షన్‌కు సుమారు 7 నెలల సమయం పడుతుంది. ఈ ఏడాది చివరిలో షూటింగ్‌ ప్రారంభించాలనుకుంటున్నా’’ అని చెప్పారు. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌లతో రాజమౌళి రూపొందించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఇటీవల విడుదలై, తెలుగు సినిమా రికార్డులను తిరగరాస్తోంది. 

మహేశ్‌ ప్రస్తుతం.. ‘సర్కారువారి పాట’ చిత్రంతో బిజీగా ఉన్నారు. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్టులో కీర్తి సురేశ్‌ కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్‌, 14 రీల్స్‌ ప్లస్‌, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో మహేశ్‌.. ఇప్పటి  వరకూ కనిపించని కొత్త లుక్‌లో అలరించనున్నారు. మరోవైపు, త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. ‘ఎస్‌ఎస్‌ఎంబీ’ వర్కింగ్‌ టైటిల్‌తో ఇటీవల ప్రారంభమైన ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయిక. ఇవి పూర్తయిన తర్వాత రాజమౌళి చిత్రం మొదలయ్యే అవకాశాలున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని