RamCharan: ఇదెక్కడి ట్విస్ట్ మావ.. సూపర్ హిట్ కాంబో రిపీట్

మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఓ సరికొత్త అప్‌డేట్‌ ఇప్పుడు అభిమానులను ఆకర్షిస్తోంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రిలీజ్‌కు ముందే ఆయన ఓ స్టార్‌ దర్శకుడితో సినిమా షూట్‌లో పాల్గొన్నారు.

Updated : 03 Nov 2022 18:23 IST

హైదరాబాద్‌: ‘రంగస్థలం’తో క్రేజీ కాంబోగా పేరు తెచ్చుకున్నారు నటుడు రామ్‌చరణ్‌ (Ram Charan) దర్శకుడు సుకుమార్‌ (Sukumar). గ్రామీణ నేపథ్యంలో సాగే మాస్‌ ఎంటర్‌టైనర్‌గా సిద్ధమైన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబట్టి హిట్‌ సొంతం చేసుకుంది. దీంతో వీరిద్దరి కాంబోలో మరో సినిమా వస్తే చూడాలని మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి కాంబోలో ఓ సరికొత్త ప్రాజెక్ట్‌ పట్టాలెక్కినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇప్పటికే హీరో పరిచయ సన్నివేశాలు కూడా చిత్రీకరించారని ప్రముఖ ప్రొడక్షన్‌ డిజైనర్‌ సాబు సిరిల్‌ తనయుడు తన మిత్రులతో అన్నారట.

‘‘రామ్‌చరణ్‌-సుకుమార్‌ కాంబోలో ఓ ప్రాజెక్ట్‌ రానుంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో రామ్‌చరణ్‌ శరీరాకృతిని మెచ్చిన ఆయన.. తన ప్రాజెక్ట్‌లోనూ చెర్రీని అదే లుక్స్‌లో చూపించనున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రిలీజ్‌కు ముందే పది నిమిషాలు నిడివి ఉన్న హీరో ఇంట్రో సీన్స్‌ చిత్రీకరించారు’’ అని సాబు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీనిని చూసిన మెగా అభిమానులు ఫుల్‌ ఖుషీలో ఉన్నారు. ‘‘ఇదెక్కడి ట్విస్ట్‌ మావ.. చరణ్‌ తదుపరి ప్రాజెక్ట్స్‌కు సంబంధించి చాలామంది దర్శకుల పేర్లు విన్నాం. కానీ, ఇది మాత్రం ఊహించలేదు’’, ‘‘వెయిటింగ్‌’’, ‘‘ఇది.. సూపర్‌ న్యూస్‌’’ అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. అంతేకాకుండా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సుకుమార్‌-చెర్రీ ప్రాజెక్ట్‌ గురించి రాజమౌళి చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకుంటున్నారు. ఆ వీడియోని షేర్‌ చేస్తూ.. ‘‘ఆయన అప్పుడే చెప్పాడు.. మనమే అర్థం చేసుకోలేకపోయాం’’ అని అనుకుంటున్నారు. ఇక రామ్‌చరణ్‌ ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ పూర్తిగానే ఆయన గౌతమ్‌ తిన్ననూరితో చేయాల్సి ఉండగా.. అది నిలిచిపోయినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. మరోవైపు సుకుమార్‌ ప్రస్తుతం ‘పుష్ప-2’ పనుల్లో బిజీగా ఉన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని