Tollywood: యాక్షన్‌ బాటలో ఆనంద్‌ దేవరకొండ.. అలరిస్తున్న ‘ఎఫ్‌ 3’ తొలిగీతం

యువ నటుడు ఆనంద్‌ దేవరకొండ కొత్త సినిమాని ప్రకటించాడు. వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌ల ‘ఎఫ్‌ 3’ చిత్రంలోని ఓ గీతం విడుదలైంది.

Updated : 06 Dec 2022 14:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘దొరసాని’, ‘మిడిల్‌ క్లాస్‌ మెలొడీస్‌’, ‘పుష్పక విమానం’ తదితర క్లాస్‌ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన నటుడు ఆనంద్‌ దేవరకొండ. తొలిసారి ఆయన ఓ యాక్షన్‌ చిత్రంలో నటిస్తున్నారు. నూతన దర్శకుడు ఉదయ్‌ శెట్టి తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి ‘గం గం గణేశా’ అనే టైటిల్‌ ఖరారైంది. ఈ చిత్రం సోమవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం కొన్ని ఫొటోల్ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంది. పోస్టర్‌లో చూపించిన దృశ్యాల్ని బట్టి ఈ సినిమా పల్లెటూరు నేపథ్యంలో సాగుతుందనిపిస్తోంది. కేదార్‌ శెలగంశెట్టి, వంశీ కారుమంచి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి చైతన్య భరద్వాజ్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. నాయికా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. రెగ్యులర్‌ షూటింగ్‌ మరికొన్ని రోజుల్లో ప్రారంభంకానుంది. ఆనంద్‌ ప్రస్తుతం ‘బేబీ’ అనే చిత్రంలో నటిస్తున్నారు. సాయి రాజేష్‌ దర్శకుడు.

నివేదా.. ఓటీటీ చిత్రం

యువ నటి నివేదా పేతురాజ్‌ ప్రధాన పాత్రలో దర్శకుడు చందు మొండేటి ఓటీటీ సినిమాని తెరకెక్కిస్తున్నారు. టీజీ విశ్వ ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ‘ఆహా’లో స్ట్రీమింగ్‌కానుంది. ఈ నేపథ్యంలో టైటిల్‌తో కూడిన ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. ‘బ్లడీ మేరీ’ అనే ఈ సినిమాలో నివేదా మేరీగా కనిపించనుంది. పోస్టర్‌లోని ఆమె సీరియస్‌ లుక్‌ ఆకట్టుకునేలా ఉంది.

‘ఎఫ్‌ 3’ డబ్బు పాట

వెంకటేశ్‌, వరుణ్‌ తేజ్‌ కథానాయకులుగా అనిల్‌ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఎఫ్ 3’. గతంలో ఇదే కాంబినేషన్‌లో వచ్చిన ‘ఎఫ్‌ 2’కి సీక్వెల్‌గా రూపొందుతోంది. తమన్నా, మెహరీన్‌ కథానాయికలు. ఈ సినిమా ఏప్రిల్‌ 28న ప్రేక్షకుల ముందుకుతీసుకొస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ క్రమంలో ‘లబ్‌డబ్‌ లబ్‌డబ్‌ డబ్బు’ అనే పాటను సోమవారం విడుదల చేసింది. భాస్కరభట్ల రచించిన ఈ గీతాన్ని రామ్‌ మిర్యాల ఆలపించారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు