Cinema News: కొత్త నటులతో ‘నెల్సన్‌’

జయంత్‌ కథా నాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘నెల్సన్‌’. అనూషారాయ్‌, సెహర్‌ కృష్ణన్‌ కథానాయికలు. సాయి సునీల్‌ నిమ్మల దర్శకత్వం వహిస్తున్నారు. జయంత్‌ కార్తీక్‌ నిర్మాత. గురువారం పూజా   కార్యక్రమాలతో ప్రారంభమైందీ చిత్రం....

Updated : 13 May 2022 13:47 IST

యంత్‌ కథా నాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘నెల్సన్‌’. అనూషారాయ్‌, సెహర్‌ కృష్ణన్‌ కథానాయికలు. సాయి సునీల్‌ నిమ్మల దర్శకత్వం వహిస్తున్నారు. జయంత్‌ కార్తీక్‌ నిర్మాత. గురువారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైందీ చిత్రం. ‘‘ఉత్కంఠ రేకెత్తించే కథ, కథనాలతో రూపొందుతున్న చిత్రమిది. స్టైలిష్‌ మేకింగ్‌తో దర్శకుడు చిత్రాన్ని తీర్చిదిద్దుతారు. రాజమండ్రిలో రెగ్యులర్‌ చిత్రీకరణ మొదలవుతుంది. విశాఖపట్నం, హైదరాబాద్‌లో కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తామ’’ని సినీ వర్గాలు తెలిపాయి. ఆనంద చక్రపాణి, షాని, హరికృష్ణ, చదలవాడ, రాజు, దివ్య, నవీనా రెడ్డి, రాజారెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అజయ్‌ పట్నాయక్‌, ఛాయాగ్రహణం: శివ దేవరకొండ, పాటలు: కాసర్ల శ్యామ్‌.


ప్రతీకారం నేపథ్యంలో...

శ్రీరామ్‌, ఎల్సా, శుభశ్రీ నాయకా నాయికలుగా తెరకెక్కుతున్న చిత్రం ‘రుద్రవీణ’. మధుసూదన్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. రాగుల లక్ష్మణ్‌, రాగుల శ్రీను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో ప్రి లుక్‌ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, తెలంగాణ టూరిజం కార్పొరేషన్‌ ఛైర్మన్‌ శ్రీనివాస్‌ గుప్తా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘చిరంజీవి నటించిన ‘రుద్రవీణ’ విడుదలైనప్పుడే నేను పుట్టాను. ఆ పేరుతోనే విభిన్నమైన ఓ మంచి యాక్షన్‌ చిత్రం తీయాలని ప్రతీకారం నేపథ్యంలో ఈ కథ రాసుకున్నా. ఉత్కంఠ రేకెత్తించే కథనంతో రాజీ పడకుండా చిత్రాన్ని తెరకెక్కించాం’’ అన్నారు. నిర్మాతమాట్లాడుతూ ‘‘చిరంజీవి అంటే నాకు సెంటిమెంట్‌. నా మొదటి సినిమా ఆయన నటించిన ‘రుద్రవీణ’ పేరుతో వస్తున్నందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు. ‘‘సహజత్వానికి పెద్దపీట వేస్తూ సినిమాలు తీస్తే తప్పకుండా సినిమాలు విజయవంతం అవుతాయి. రౌద్రంతో కూడిన ఈ రుద్రవీణ ప్రేక్షకుల్ని మెప్పిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి. ప్రతాని రామకృష్ణగౌడ్‌, చిత్రంలో విలన్‌గా నటించిన రఘు కుంచెతోపాటు చలాకీ చంటి, శ్రీను, మహావీర్‌, రాంబాబు గోసాల తదితరులు పాల్గొన్నారు.


‘పృథ్వీరాజ్‌’ హరి హర్‌...

టీవల విడుదలైన ట్రైలర్‌తో అందరిలోనూ ఆసక్తిని పెంచిన చిత్రం ‘పృథ్వీరాజ్‌’. అక్షయ్‌ కుమార్‌, మానుషి ఛిల్లర్‌ నాయకానాయికలు. సంజయ్‌దత్‌, సోనూసూద్‌, అశుతోశ్‌ రాణా, మానవ్‌ విజ్‌, లలిత్‌ తివారీ ప్రధానపాత్రల్లో నటించారు. జూన్‌ 3న విడుదలకానున్న ఈ చిత్రం నుంచి తొలి పాటను గురువారం  విడుదల చేశారు. ‘హరి హర్‌..’అంటూ సాగే ఈ గీతంలో ‘పృథ్వీరాజ్‌’ ఆత్మను వర్ణించారు. లిరికల్‌ వీడియోలో చూపించిన యుద్ధ, ప్రేమ సన్నివేశాలు ఉత్తేజభరితంగా ఉన్నాయి. తన మాతృభూమి కోసం వీరోచిత పోరాటాలు చేసిన ఓ మహాయోధుడి గురించి రాసిన ఈ గీతం అద్భుతంగా ఉందని అక్షయ్‌ తెలిపాడు. దర్శకుడు చంద్రప్రకాశ్‌ ద్వివేది మాట్లాడుతూ పృథ్వీరాజ్‌ ధర్మం, శౌర్యంతో పాటు ప్రేమనూ అంతే అందంగా చూపించామ’న్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ సంస్థ నిర్మించింది.


తొలిప్రేమను తలచుకునేలా‘మై కీ కరా..’

తొలిప్రేమ జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తాం అంటూ ‘లాల్‌ సింగ్‌ చద్దా’ చిత్రబృందం రెండో లిరికల్‌ను విడుదల చేసింది. ‘మై కీ కరా..’ అంటూ సాగే ఈ మెలొడీని ముందుగానే ప్రకటించినట్లు వీడియో లేకుండా విడుదల చేశారు. గుండెలోతులను తాకేలా ఈ గీతాన్ని సోనూనిగమ్‌, రోమీ ఆలపించారు. అమితాబ్‌ భట్టాచార్య సాహిత్యం, ప్రీతమ్‌ సంగీతం ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో ఆమిర్‌ ఖాన్‌, కరీనాకపూర్‌ జంటగా నటిస్తున్నారు. నాగ చైతన్య ప్రధానపాత్రల్లో కనిపిస్తారు. లాల్‌ తన చిన్ననాటి ప్రేమను గుర్తుచేసుకునే సందర్భంలో ఈ పాట రానుంది. ఓ కొత్త పోస్టర్‌నూ విడుదల చేశారు. అద్వైత్‌ చందన్‌ దర్శకత్వం వహిస్తున్నారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని