సొంత తమ్ముడే నాకు విషం ఇచ్చాడు.. సంచలన ఆరోపణలు చేసిన నటుడు

డబ్బు కోసం సొంత వ్యక్తులే తనని ఇబ్బంది పెట్టారంటూ సంచలన ఆరోపణలు చేశాడు నటుడు పొన్నంబలం (ponnambalam). అనారోగ్యం నుంచి కోలుకున్న ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.

Updated : 16 Mar 2023 10:16 IST

చెన్నై: సొంత తమ్ముడే తనకు విషం పెట్టి చంపాలనుకున్నాడని ప్రముఖ నటుడు పొన్నంబలం (ponnambalam) సంచలన ఆరోపణలు చేశాడు. ఆస్తి కోసం అయినవాళ్లే తనని ఇబ్బందిపెట్టారని పేర్నొన్నాడు. కిడ్నీ సంబంధిత సమస్య నుంచి ఇటీవలే కోలుకున్న ఆయన తాజాగా ఓ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. తన ఆరోగ్యం, చిరంజీవి చేసిన సాయం సహా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు .

‘‘మద్యం తాగడం వల్లే నా కిడ్నీలు పాడైపోలేదు. అయినవాళ్లే నన్ను చంపాలని చూశారు. నా తండ్రికి నలుగురు భార్యలు. మూడో భార్య కుమారుడిని నా సొంత తమ్ముడిగా భావించి మేనేజర్‌గా పెట్టుకున్నా. నా వృత్తిపరమైన విషయాలన్నీ చూసుకునేవాడు. అతడిని ఎంతో నమ్మాను. ఓసారి నేను తాగే బీర్‌లో అతడు ‘స్లో పాయిజన్‌’ కలిపాడు. అంతటితో ఆగకుండా విషం కలిపిన ఆహారాన్ని పెట్టేవాడు. డబ్బు కోసం నాపై చేతబడి చేయించాడు. కొంతకాలానికి నా కిడ్నీలు దెబ్బతిన్నాయి. వైద్యుల్ని సంప్రదిస్తే విష ప్రయోగం జరగడం వల్లే ఇలా అయ్యిందని చెప్పారు’’ అంటూ తన తమ్ముడిపై పొన్నంబలం (ponnambalam) ఆరోపణలు చేశాడు.

అలాంటి కష్ట సమయంలో చిరంజీవి (Chiranjeevi) చేసిన సాయాన్ని గుర్తు చేసుకుంటూ.. ‘‘కిడ్నీ సమస్యతో ఇబ్బందిపడినప్పుడు చికిత్సకు అవసరమైన మొత్తం నా వద్ద లేదు. ఏం చేయాలో, ఎవరిని అడగాలో అర్థం కాలేదు. అలాంటి సమయంలో చిరంజీవి గుర్తుకువచ్చారు. ఆయనకు ఫోన్‌ చేసి నా సమస్య చెప్పి, సాయం చేయమని అడిగాను. నేనున్నానంటూ ఆయన భరోసానిచ్చారు. రూ.లక్ష లేదా రూ.రెండు లక్షలు పంపిస్తారనుకున్నా. కానీ, ఆయన.. ‘మరో ఐదు నిమిషాల్లో అపోలో ఆస్పత్రి నుంచి నీకు ఫోన్‌ వస్తుంది. రిపోర్ట్స్‌ తీసుకువెళ్లి అక్కడ జాయిన్‌ అవ్వు’ అని చెప్పారు. నేను ఎలాంటి ఫీజు చెల్లించలేదు. చికిత్సకు రూ.40 లక్షలు అయితే అంతా ఆయనే చూసుకున్నారు. ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటా’’ అని పేర్కొన్నాడు. చికిత్స అనంతరం తన ఆరోగ్యం కాస్త మెరుగైందని వివరించాడు. తమిళనాడుకు చెందిన పొన్నంబలం (ponnambalam) తెలుగులో ఎన్నో చిత్రాల్లో ప్రతినాయకుడిగా నటించాడు. ‘ఘరానా మొగుడు’, ‘అల్లరి ప్రియుడు’, ‘మెకానిక్‌ అల్లుడు’ వంటి సినిమాల్లో విలన్‌గా కనిపించి.. టాలీవుడ్‌లో మంచి గుర్తింపు పొందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని