MAA Elections: పోస్టల్‌ బ్యాలెట్‌ వివాదం.. విష్ణు మనిషి రూ.28వేలు ఇచ్చాడు!

తెలుగు చిత్ర పరిశ్రమలో మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది

Updated : 05 Oct 2021 13:11 IST

హైదరాబాద్‌: తెలుగు చిత్ర పరిశ్రమలో మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. పోలింగ్‌ తేదీ దగ్గర పడుతున్న వేళ, సరికొత్త వివాదాలు తెరపైకి వస్తున్నాయి. మంగళవారం పోస్టల్‌ బ్యాలెట్‌పై వివాదం నెలకొంది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి మంచు విష్ణు ప్యానెల్‌ పోస్టల్ బ్యాలెట్‌ను దుర్వినియోగం చేస్తోందని సినీ నటుడు, మా అధ్యక్ష అభ్యర్థి ప్రకాశ్‌రాజ్‌ ఆరోపించారు. ఈ మేరకు ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలో పోస్టల్‌ బ్యాలెట్‌ వివాదంపై ‘మా’ ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌ స్పందించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘కరోనా కారణంగా తొలిసారి పోస్టల్‌ బ్యాలెట్‌ పెట్టాం. ‘మా’లో 60ఏళ్లు పైబడిన సభ్యులు 125మంది ఉన్నారు. ఇప్పటివరకూ 60మంది సభ్యులు పోస్టల్‌ బ్యాలెట్‌ కావాలని అడిగారు. సాయంత్రం 60మందికి పోస్టల్‌ బ్యాలెట్‌ పేపర్లు పంపిస్తాం. పోస్టల్‌ బ్యాలెట్‌ పేపర్‌కు నామినల్‌గా రూ.500 చెల్లించాలి. డబ్బు చెల్లించాల్సిన బ్యాంకు అకౌంట్‌ వివరాలు సభ్యులకు పంపాం. డబ్బు చెల్లింపుపై సీనియర్‌ సభ్యులకు అవగాహన లేదు. ఆ ప్రక్రియ కోసం మంచు విష్ణుకు వాళ్లు ఫోన్‌ చేశారట. దీంతో ఆయన తరపున ఒక వ్యక్తి వచ్చి ఆ మొత్తం డబ్బు చెల్లించారు. ఒకే వ్యక్తి డబ్బు చెల్లించటం నిబంధనలకు విరుద్ధం. పోస్టల్‌ బ్యాలెట్‌కు చెల్లించిన రూ.28వేలు తిరిగి ఇచ్చేశాం. ప్రస్తుత పరిస్థితుల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ రద్దు చేసే అవకాశం లేదు. ప్రకాశ్‌రాజ్‌ ఫిర్యాదుపై మధ్యాహ్నం నిర్ణయం తీసుకుంటాం’’ అని వివరణ ఇచ్చారు.

ప్రకాశ్‌రాజ్‌ ఏమంటున్నారంటే..‘‘60 ఏళ్లు పైబడిన నటీనటులు పోస్టల్‌ బ్యాలెట్‌కు అర్హులు. ఏజెంట్ల ద్వారా పోస్టల్‌ బ్యాలెట్‌ కుట్ర చేస్తున్నారు. అర్హత ఉన్న సభ్యుల నుంచి విష్ణు ప్యానల్‌ సంతకాలు సేకరిస్తోంది. నిన్న సాయంత్రం విష్ణు తరఫున ఓ వ్యక్తి 56 మంది సభ్యుల తరఫున రూ.28వేలు కట్టారు. ఆయన కడితే ఇక్కడ ఎలా తీసుకున్నారు? కృష్ణ, కృష్ణంరాజు, శారద, పరుచూరి బ్రదర్స్‌, శరత్‌బాబు తదితరుల పోస్టల్‌ బ్యాలెట్‌ డబ్బులు కూడా మంచు విష్ణు తరఫు వ్యక్తే కట్టారు. ఆగంతుకులతో ‘మా’ ఎన్నికలు నిర్వహిస్తామా?ఇలా గెలుస్తారా?మీ హామీలు చెప్పి గెలవరా? ఇంత దిగజారుతారా? ఈ విషయంపై పెద్దలు కృష్ణంరాజు, చిరంజీవి, నాగార్జున సమాధానం చెప్పాలి’’ అని ప్రకాశ్‌రాజ్‌ అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని